పరిషత్ ఎన్నికల జాప్యం మంచిది కాదు , రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో : ఎస్ఈసి నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణపై చర్చించటం కోసం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్ని పలు కీలక వ్యాఖ్యలు చేశారు .

గతంలో ఆగిన చోట నుండి ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తాం.. ఎన్నికల కోడ్ అమల్లో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించామని పేర్కొన్న ఆమె , అన్నీ పరిశీలించిన తరువాత నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు . ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు .
గతంలో ఆగిన చోట నుండి ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని , అందుకే ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుండి కొనసాగించేలా నోటిఫికేషన్ ఇచ్చినట్లు నీలం సాహ్ని వెల్లడించారు.

ఇప్పటికే ఆగిన ఎన్నికలు .. జాప్యం మంచిది కాదన్న నీలం సాహ్ని
మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిందని ఇంకా జాప్యం చేయడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం మాట్లాడిన నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని పేర్కొన్న నీలం సాహ్ని, ఎన్నికలను వాయిదా వేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.

గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థనే ఇప్పుడు కూడా పని చేస్తుంది
గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థ ఇప్పుడు కూడా పని చేస్తుందని ఆమె తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తామని పేర్కొన్న నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకేశారు.
ఇదిలా ఉంటే అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్ఈసి సమావేశానికి హాజరు కాగా టీడీపీ ,బీజేపీ , జనసేన పార్టీలు సమావేశాన్ని బహిష్కరించాయి .












Click it and Unblock the Notifications