బిల్లు తిరస్కరణ: అధిష్టానానికి ఇబ్బంది, ఆగుతుందా?
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర శాసనసభ తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించింది. బిల్లును వెనక్కి పంపించాలని సభలో తీర్మానం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును సభలో ప్రతిపాదించి, మూజువాణి ఓటు ద్వారా అది నెగ్గిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించి తెలంగాణ బిల్లుకు ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ బిల్లును ఓడించి ప్రభుత్వం వెనక్కి పంపిస్తున్నట్లయింది.
సభ మూజువాణీ ఓటుతో బిల్లు వీగిపోయిందని ప్రకటించి, సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నినాదాలు చేస్తూ బయటకు వెళ్లారు. తద్వారా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తాను నెగ్గినట్లుగా చూపించుకున్నారు. శాసనసభ తిరస్కరించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదనే విషయం తెలిసినప్పటికీ ఆయన తన వాదనను నెగ్గించుకునే ప్రయత్నంలో విజయం సాధించినట్లు భావిస్తున్నారు.

తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెసు అధిష్టానానికి ఇబ్బంది కలిగే మాట నిజమే. తిరస్కరణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించకూడదని రాష్ట్రపతిని కోరుతామని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే, తీర్మానాన్ని నెగ్గించుకుని, టీ బిల్లును తిరస్కరించడమనేది ప్రహసనం మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు అన్నారు.
తెలంగాణ బిల్లును తిరస్కరించే విషయంలో ముఖ్యమంత్రి పోషించిన పాత్రను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తీవ్రంగా తప్పు పట్టారు. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి తీరుపై తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలను కూడా ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన అన్నారు. శాసనసభ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం సాధించుకోవడంలో కాంగ్రెసు అధిష్టానానికి నైతికపరమైన సమస్య ఎదురవుతుందనే విషయంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications