ఇష్టం లేని వివాహం : కన్న కొడుకునే కడ తేర్చాడు
విశాఖపట్నం: తనకు ఇష్టం లేని వివాహం చేసుకున్నాడనే కోపంతో ఓ తండ్రి కన్న కొడుకునే కడ తేర్చాడు. కొడుకును అతను తుపాకీతో కాల్చి చంపాడు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో ఈ సంఘటన జరిగింది.
అరకులోయ సీఐ వెంకునాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. అనంతగిరి మండలంలోని కొండిభ పంచాయతీ గరిగుడ్డి గ్రామానికి చెందిన జన్నిపల్లకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు వేరే గ్రామంలో నివాసం వుంటున్నాడు.

రెండో కుమారుడు ఎర్రయ్య ఐదేళ్ల క్రితం ఇదే మండలం కోనాపురం పంచాయతీలోని సారగుడ గ్రామానికి చెందిన ముక్తను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహం ఇష్టం లేని పల్ల ఐదేళ్లుగా అతన్ని ఇంటికి దూరంగానే ఉంచాడు. దీంతో గ్రామంలోనే ఒక పూరింటిలో ఎర్రయ్య నివాసం ఉంటున్నాడు.
అలా ఉండనీయకుండా కుమారుడు కనిపించిన ప్రతిసారీ గొడవ పడేవాడు. బుధవారంనాడు అలాగే గొడవ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎర్రయ్య డముకు వారపు సంతకు బయలుదేరే సమయంలో నాటు తుపాకీ తీసుకువచ్చి కాల్చాడు. దీంతో ఎర్రయ్య అక్కడికక్కడే మరణించాడు.
ఎర్రయ్యకి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఎర్రయ్య భార్య ముక్త ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications