ఫీజు రీయంబర్స్మెంట్పై రివ్యూ: స్థానికతే గీటురాయి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను విపక్షాలకు ప్రభుత్వం వివరించింది. అనంతరం ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 2014-15 విద్యా సంవత్సరంలో పాత విధానం ప్రకారమే ఫీజు చెల్లించాలని నిర్ణయించారు.
స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు సీమాంధ్రతోపాటు దేశంలోని ఏ ప్రాంతంలో చదువుతున్నా పాత నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, తెలంగాణలో చదువుకుంటున్న సీమాంధ్ర విద్యార్థుల ఫీజులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రీయింబర్స్మెంట్ పథకం కింద కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల బకాయిలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను ఇక ముందు కూడా పాటించాలని నిర్ణయించారు. ఫీజుల పథకానికి సంబంధించి అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రావడంతో నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది.
సమావేశంలో కాంగ్రెస్ తరఫున డి.శ్రీనివాస్, గీతారెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీ, బీజేపీ నుంచి డాక్టర్ లక్ష్మణ్, వైసీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లుతోపాటు టీఆర్ఎస్ నుంచి ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కె.జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.