పవన్ టిడిపిలోకి రావాలి: చిరంజీవికి గంటా షాక్, వివరణ
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఝలక్ ఇచ్చారు. గంటా బుధవారం మాట్లాడుతూ... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. గంటా 2009లో చిరంజీవి అప్పుడుస్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు.
ప్రజారాజ్యం విలీనం కావడంతో ఆయన కాంగ్రెసు పార్టీలో మంత్రి అయ్యారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ అంధ్రప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంత నేతలు అందరూ వరుసగా కాంగ్రెసు పార్టీని వీడుతున్నారు. నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైపు చూస్తున్నారు.
గంటా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమస్యలపై బాగా స్పందించే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. కాగా, పవన్ పార్టీ పెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నందున ఆయన ఎలాగు టిడిపిలోకి వచ్చే అవకాశం లేదు. పవన్ పార్టీ పేరు జనసేనగా ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో తాను పవన్ కల్యాణ్ పైన విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయని, అవి పూర్తి అవాస్తవమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పైన ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు రాష్ట్రాలను కలుపుతామని కిరణ్ పార్టీ పెట్టడం తగదన్నారు.