నో రూలింగ్ పార్టీ... నో అపోజిషన్!: అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేయాలన్న గవర్నర్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేవాలయం లాంటి అసెంబ్లీ అల్లరి మూకల అడ్డాగా మారిందని స్పీకర్ కోడెల ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ కూడా అదే స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాల విద్యపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో కొనసాగుతున్న బుక్ ఫెయిర్ను సందర్శించిన గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
పాఠశాల విద్య బాగుపడాలంటే అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని ఆయన అన్నారు. ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్... ఏటా అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి. ప్రధానంగా పాఠశాల విద్యపై ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేసి అయినా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బాగోగులకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి, పనితీరుపై ఏటా ప్రభుత్వానికి నివేదిక అందాలని, అప్పుడే పాఠశాల విద్య బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 29వ హైదరాబాద్ బుక్ఫెయిర్ను మంత్రి ఈటల రాజేందర్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్లతో కలిసి గవర్నర్ మంగళారం సందర్శించారు.