రైతులకు మేలు చేయకుండా...అలా అనడానికి బాబుకు నోరెలా వచ్చింది:జగన్
పశ్చిమగోదావరి: రాష్ట్ర అభివృద్ధి పథంలో పరుగెత్తుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, ఈ నాలుగేళ్లలో రైతులు ఎవరైనా బాగుపడ్డారా?...వారికి ఏమైనా మేలు జరిగిందా? అని వైసిపి అధినేత జగన్ ప్రశ్నించారు. రైతులకు మేలు జరగకుండా అభివృద్ధి జరిగిందని అనడానికి చంద్రబాబుకు నోరు ఎలా వచ్చిందని జగన్ మండిపడ్డారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్...దెందులూరులో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి గత ఎన్నికల హామీల ప్రణాళిక తీసేశారని జగన్ ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు చెప్పారని...88,612 కోట్ల రూపాయల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అన్నారని...కానీ వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి చంద్రబాబు నాయుడి పాలన చూసిన తర్వాత...మనం ఎలా బ్రతుకుతున్నాం...ఈ నాలుగేళ్లలో మనం ఏమైనా ముందడుగు వేశామా? లేక వెనకడుగు వేశామా?...అనే విషయాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి మీటింగులో, ప్రతి గోడ మీద టీడీపీ నాయకులు చెప్పిన, రాసిన మాటలు ఇవేనని...బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని అన్నారు. కానీ, బ్యాంకుల వాళ్లు పంపించిన వేలం నోటీసులు మాత్రమే ఇప్పుడు ఇంటికి వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
"చంద్రబాబు చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. గత ప్రభుత్వాలు అన్ని కూడా వడ్డీలు బ్యాంకులకు చెల్లించి, ప్రజలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించేవి. రైతులకు, పొదుపు సంఘాలకు బ్యాంకులు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం లేదు...5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తెస్తామని చంద్రబాబు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీ...టీడీపీ పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రైతులకు అందడం లేదు...చంద్రబాబుకు పలు రాష్ట్రాల్లో హెరిటేజ్ షాపులు ఉన్నాయి...రైతుల నుంచి తక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేసి, మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ధరలకు వాటిని హెరిటేజ్ షాపుల్లో అమ్ముతున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు దళారిగా మారిపోయారు"...అని చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు.
పోలవరం ప్రాజెక్టు నిజంగా ఇవాళ కాస్తోకూస్తో నడుస్తోందంటే కారణం కుడికాల్వలో 90 శాతం, ఎడమ కాలువలో 70 శాతం పనులు వైఎస్సార్ పూర్తి చేశారు. మిగిలిన పనులను నాలుగేళ్లుగా పూర్తి చేయలేకపోయారు. గతంలో తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరంను అసలు పట్టించుకోలేదు. పోలవరంలో ఇప్పటివరకూ 36 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు కేవలం ఆరు వేల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. కేంద్రానికి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను వదిలేయాల్సిందిపోయి లంచాల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే అన్ని ముడిసరుకుల రేట్లు తగ్గుతున్నా.. కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు మాత్రం పెరుగుతూ పోతోంది. ఇందుకు కారణం కాంట్రాక్టర్ కేబినేట్ మంత్రి యనమలకు వియ్యంకుడు కావడం...పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు...చంద్రబాబు కొత్తగా కట్టుకున్న ఇంటి బాత్రూం సైజు కూడా లేవని జగన్ దుయ్యబట్టారు.