ఈయన గాని ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే...ఇక్కడ రికార్డు బద్దలే!
గుంటూరు:ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి "అధ్యక్షా" అని నోరారా పిలిచి తరించిపోవాలనేది అనేకమంది రాజకీయ ఔత్సాహికుల కల. అయితే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం అంటేనే తల ప్రాణం తోకకు వచ్చినంత పననేది సీనియర్ ఎమ్మెల్యేల మాట.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టినా... దశాబ్ధాలు గడిచినా ఆ కల నెరవేరక ఎంతోమంది నిరాశతో కుమిలిపోతుంటారు. అలాంటిది ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఆ అవకాశం రావడం...అన్నిసార్లు విజేతగా నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి అసామాన్యులు గుంటూరు జిల్లాలో అతి కొద్ది మందే ఉన్నారు. అయితే ఆరుసార్లు గెలిచినవాళ్లు మాత్రం ఎవరూలేరు. అయితే ఇప్పుడు ఆ అరుదైన రికార్డు సాధించే అవకాశం ఒక ఎమ్మెల్యే ముంగిట్లో ఉంది. ఆయనే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
గుంటూరు జిల్లా నుంచి వావిలాల గోపాల కృష్ణయ్య (సత్తెనపల్లి), గణపా రామస్వామిరెడ్డి వంటి నేతలు వరుసగా నాలుగుసార్లు గెలిచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు రికార్డు సృష్టించారు. అప్పట్లో ఆ విషయాన్నే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అయితే తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ రికార్డును బ్రేక్చేసే అవకాశం ఆ పార్టీలో ముగ్గురు నేతలకు లభించింది. వాళ్లెవరంటే...

వైద్య వృత్తిని వదిలి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు, డాక్టర్ మాకినేని పెదరత్తయ్య ఇరువురూ ఎమ్మెల్యేలుగా నరసరావుపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వరుసగా ఐదుసార్లు (1983, 85, 89, 94, 99) విజయం సాధించి రికార్డు సృష్టించారు. అయితే 2004 ఎన్నికల్లో విజయం సాధిస్తే వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధులుగా జిల్లాలో అరుదైన రికార్డు స్థాపించే అవకాశం వీరికి లభించేది. అయితే అప్పుడు ఇద్దరూ పరాజయం పాలవడంతో ఇద్దరు నేతలకు ఆ ఛాన్స్ 'మిస్' అయింది.
ఇక నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎస్సీలకు రిజర్వు కావడంతో మాకినేనికి అక్కడనుంచి పోటీ చేసే అవకాశం లేకుండాపోగా...కోడెల మాత్రం ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించినా నరసరావుపేటలో పరాజయం తప్పించుకోలేకపోయారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందినా అది వరుసగా ఆరో విజయం కాకపోవడం గమనార్హం.
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ కూడా వరుసగా ఐదు సార్లు (1989, 94, 99, 2004, 2009) ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, గుంటూరు పశ్చిమ నుంచి ఒక పర్యాయం గెలుపొందారు. అయితే ఆరోసారి ఆయన కూడా ఓటమి పాలయ్యారు.
వరుసగా ఐదు సార్లు విజయాన్ని అందుకున్న ఈ ముగ్గురు నేతలు డబుల్ హ్యాట్రిక్ సాధించడంలో మిస్ అయిపోవడం కొసమెరుపు. అయితే ఇప్పుడు ఇలాంటి అరుదైన అవకాశం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు ముంగిట్లో ఉంది.
జిల్లాలో పార్టీ ఓడిపోయినా ఒకేఒక్కడుగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ధూళిపాళ్ల వీరయ్యచౌదరి కుమారుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ 1994 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి ఐదుసార్లు వరుసగా విజయం సాధించిన నేతల సరసన చేరారు.
వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగడం ఖాయమైన నరేంద్ర ఆ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తే జిల్లాలో ఇప్పటివరకూ లేని డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటారు. మరి తన రాజకీయ జీవితంలో గొప్ప మైలురాయిగా నిలిచే ఈ అరుదైన రికార్డును దూళిపాళ్ల నరేంద్రకుమార్ సాధించి జిల్లాలో మరోమారు ఒకేఒక్కడు అనిపించుకుంటారో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications