జెఎన్టియుకె కీచక ప్రొఫెసర్ పై నిర్భయ కేసు!...అరెస్ట్ కు రంగం సిద్దం?..
కాకినాడ: ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ జెఎన్టియు ప్రొఫెసర్ కె బాబులుపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. వర్సిటీ అధికారులు చేసిన ఫిర్యాదుమేరకు కాకినాడ నగరంలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ బాబులుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది.
తమను లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ బాబులుపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని, విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీ నుంచి వర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రాజకీయ పలుకుబడి, వర్సిటీ అధికారుల అండదండలు కలిగిన ప్రొఫెసర్ ను రక్షించేందుకు కుట్ర జరుగుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు. దీంతో వర్సిటీ అధికారులు ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోక తప్పనట్లు తెలుస్తోంది.
ప్రొఫెసర్ కె.బాబులుపై చర్యలకు తొలుత వర్సిటీ వీసీ ఆచార్య విఎస్ఎస్ కుమార్ వెనుకడుగు వేసినట్లు తెలిసింది. వర్సిటీ డైరెక్టర్ పదవి నుండి ప్రొఫెసర్ను తొలగించామని, ఎంటెక్ తరగతులకు వెళ్ళకుండా చూస్తామని విసి హామీయిచ్చారు. అయితే సస్పెండ్ చేసే అధికారం మాత్రం తనకు లేదని కూడా చెప్పారు. దీంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించి తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్నివీసీ కుమార్ తదితరులు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. వర్సిటీ విద్యార్థులు సైతం కలెక్టర్ను కలసి కీచక ప్రొఫెసర్ ఆగడాలను వివరించారు.
ఇదే సమయంలో విద్యార్థినులకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా వర్సిటీ అధికారులు, కలెక్టర్ తదితరులు విద్యార్థులకు సూచించినట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్ళకుండా, అధికారులే ఫిర్యాదుచేయాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు వీసీ ఆదేశాల మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈమేరకు ప్రొఫెసర్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశామని సర్పవరం సీఐ చైతన్యప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్పై సర్పవరం పోలీస్ స్టేషన్లో 254, 254 ఎ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ బాబులును అరెస్ట్ చేసేందుకు సర్పవరం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ వ్యవహారం వర్సిటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.