అమిత్ షా ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు... ఖండిస్తున్నాం:టిడిపి నేత జూపూడి
అమరావతి:ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను టీడీపీ ఖండిస్తున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. సెక్రటేరియట్ పబ్లిసిటీ సెల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగు దేశం పార్టీ భారత రాజ్యాంగానికి కట్టుబడిన లౌకికవాద రాజకీయ పార్టీ అని జూపూడి చెప్పారు. బిజేపీని మతమౌఢ్యంతో...సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరించే పార్టీ అభివర్ణించారు. కర్ణాటక ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చెక్ పెట్టినా బీజేపీకి ఇంకా బుద్ధి రాలేదా అని జూపూడి ప్రశ్నించారు. మతవాదులుగా ముద్రపడితే మీకే నష్టం అని జూపూడి బిజేపీ నేతలకు హితవు పలికారు.
భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి...లౌకిక స్వరూప రక్షణకు ప్రార్థనలు చేయాలంటూ ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ రాసిన లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. వివిధ మతాలు, భాషలు, కులాలు, వర్గాలు ఉన్న భారతదేశ లౌకిక స్వరూపానికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమన్నారు. గాయపడ్డ హృదయాలు, వ్యక్తులు, సంస్థలు గొంతెత్తి మాట్లాడతాయని, అందులో భాగంగానే జోసఫ్ దేశం కోసం ప్రార్థనలు చేయమన్నారని, అందులో తప్పేముందని జూపూడి ప్రశ్నించారు.
అయినా జోసెఫ్ 2019 లో ఏర్పడే ప్రభుత్వం గురించి అన్నారేగాని, ఏ ప్రభుత్వమో ఆయన పేర్కొనలేదని...మరలాంటప్పుడు అమిత్ షా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, ఆయనకు భయం దేనికని జూపూడి నిలదీశారు.దేశంలో కుల, మత, వర్గ వివక్షలేదని అమిత్ షా చెబుతున్నారని, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ పేరుతో దేశంలో వివక్ష కొనసాగుతోందని జూపూడి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, టీడీపీ నేతలు గానీ ఎవరూ జోసఫ్ వ్యాఖ్యలపై మాట్లాడలేదని జూపూడి గుర్తు చేశారు.ప్రజాస్వామ్యవాదులను ఏకం చేయడం కోసం చంద్రబాబునాయుడు చేసే ప్రయత్నాలను బీజేపీ సహించలేకపోతోందని జూపూడి విమర్శించారు.
ఇక వైసీపీ నేతలు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతారని, ఢిల్లీలో బైబిల్ వ్యతిరేకులతో చేతులు కలుపుతారని జూపూడి ధ్వజమెత్తారు. ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ నుద్దేశించి అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ స్పందన ఏంటో తెలియజేయాలని జూపూడి డిమాండ్ చేశారు. జగన్ కేసుల నుంచి బయటపడటానికి ఆ పార్టీని బీజేపీలో కలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రైస్తవులకు తమ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.