బస్సు ప్రమాదం: పోస్టర్ విడుదల, విచారణ వేగవంతం
హైదరాబాద్: దాదాపు రెండు నెలల క్రితం మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది అమాయక ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. తమకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు బుధవారం హిమయత్ నగర్లో ఆరని మండల పోరాటం పోస్టర్ను విడుదల చేశారు. రెండు నెలలు గడుస్తున్నా తమకు ఎలాంటి న్యాయం దక్కలేదని, నిత్యం కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం కరగడం లేదంటూ వారు ఆరోపించారు.
పాలెం బస్సు ప్రమాదంపై దర్యాఫ్తు వేగవంతం
మరోవైపు మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంపై సిఐడి దర్యాఫ్తు వేగవంతం కానుంది. తమకు న్యాయం చేయాలంటూ ప్రమాద బాధితులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో దర్యాఫ్తును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం సిఐడిని ఆదేశించింది.
45 మంది ప్రాణాలను బలి తీసుకున్న బస్సు దుర్ఘటనలో బాధితులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు యాజమాన్యానికి సంబంధించిన వివరాలు వంటివి అధికారికంగా వెల్లడవకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
సిఐడి డిఎస్పీ మురళీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చాలా వరకు దర్యాఫ్తును పూర్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదికి సమర్పించేందుకు సిద్ధమైంది.