వైద్యులపై కస్సుమన్న కామినేని: మావో కదలికలపై చిన్నరాజప్ప
విజయవాడ/ హైదరాబాద్: పాత ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు కూడా సమయానికి రారు, రోగులు ఎంత సేపు వేచి ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఇదేనా మీరు చేసే పని అంటూ మండిపడ్డారు. ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన వచ్చిన సమయానికి ఏ ఒక్క వైద్యుడూ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలోని అవినీతిపై ఓ రోగి మంత్రికి వివరించారు. డబ్బులు ఇవ్వందే సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. రోగుల ఫిర్యాదులు విన్న మంత్రి దీనిపై వెంటనే ప్రత్యేక విచారణ జరిపించి, బాధ్యులపైకఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఆస్పత్రి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు.
ఇదిలావుంటే, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప తెలిపారు. బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతాధికారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు.
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అందులోభాగంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 24 పోలీసు స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఏపీలో బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఇకపై జిల్లా కలెక్టర్, ఎస్పీల అనుమతి తప్పనిసరి అని, వారు పర్యవేక్షించి అనుమతించిన తర్వాతనే బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చినరాజప్ప వెల్లడించారు.