చంద్రబాబుపై కెఇ అసంతృప్తి: సంచలన వ్యాఖ్యలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడి ఎంపికపై ఆయన తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురైనట్లు కనిపిస్తోంది.
శనివారం జరిగిన మినీ మహానాడులో ఆయన చంద్రబాబుపై తీరుపై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న కెఈ కృష్ణమూర్తి ఈ సమావేశానికి హాజరు కాకూడదని అనుకున్నట్లు సమాచారం. అయితే, ఆయన సమావేశానికి వచ్చి జిల్లా అధ్యక్షుడి ఎంపికపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కర్నూలు జిల్లాపై దృష్టి పెట్టడం లేదని, చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలిచామని, పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిచామని చంద్రబాబు అంటారని ఆయన గుర్తు చేస్తూ కర్నూలులో మూడు సీట్లు మాత్రమే గెలవడంలో తమ తప్పు లేదని ఆయన అన్నారు. మైనారిటీలు, క్రైస్తవులు టిడిపికి వ్యతిరేకంగా ఓటేశారని ఆయన చెప్పారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడు చాలా శ్రమపడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడికి అవగాహన లేదని, జిల్లాలో ఏ వీధి ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలియదని కెఇ కృష్ణమూర్తి అన్నారు. గతంలో కూడా ఓ సందర్భంలో కెఈ కృష్ణమూర్తి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.