రచ్చబండతో ప్రజల్లోకి కిరణ్: తెలంగాణలో ఉంటుందా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చే నెల ప్రారంభం నుంచి రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు. నవంబర్ 6 నుంచి 24 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
రచ్చబండపై గురువారం ఉదయం మంత్రివర్గ ఉపసంఘం సమవేశమై చర్చించింది. సమావేశంలో రచ్చబండ తేదీలను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈనెల 30 కేబినేట్ సబ్ కమిటీ భేటీ జరుగనున్నట్లు మంత్రి చెప్పారు. నేటి వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించామని మంత్రి తెలిపారు.
మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 13.65 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 14.58 లక్షల రేషన్కార్డులు,7.62 లక్షల పిన్షన్లు, 1.09 లక్షల మంది వికలాంగులకు పించిను అందజేస్తామని, 20 నుంచి 39 శాతం ఉన్న వికలాంగులకు రచ్చబండలో పించన్లు మంజూరు చేస్తామని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
ముఖ్యమంత్రి పర్యటన తేదీలను త్వరలో ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో ఉంటుందా, ఉండదా అనే విషయంపై ఎవరూ నోరు విప్పడం లేదు. తెలంగాణ వ్యతిరేకిగా ఆయనను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అభివర్ణిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి వాడుకుంటారా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది.
గత కొద్ది కాలంగా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, సీమాంధ్రలోని సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అది సాధ్యపడలేదు. సమైక్యాంధ్ర చాంపియన్గా ముందుకు వచ్చే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకింగా తన వైఖరిని చెబుతూ, అధిష్టానంపై తిరుగుబాటు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతారనే పుకార్లు కొద్ది కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రచ్చబండ కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొని ఉంది.