విశాఖలో రాజధాని, సీమలో ఒక అసెంబ్లీ: కిషోర్ సూచన
న్యూఢిల్లీ: విభజన తర్వాత ఏర్పడబోయే నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే రాయలసీమను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించి ఇరు ప్రాంత ప్రజల అనుకూలత దృష్ట్యా ఒక అసెంబ్లీ సమావేశాన్ని రాయలసీమలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చెబుతున్నారు.
ఈ విషయమై ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లకు లేఖ రాశారు. విభజన అనంతరం సీమాంధ్రకు విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరారు. ఆయన ఈ నెల 3న రాసిన లేఖల ప్రతులను బుధవారం మీడియాకు విడుదల చేశారు.
రాజధానిగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు విశాఖపట్నానికి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ టౌన్ ప్లానర్లు విశాఖను భవిష్యత్ నగరంగా అభివర్ణిచారంటూ చెప్పారు. విశాఖకు సహజసిద్ధమైన ఓడరేవు ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని, తూర్పు తీరంలో అన్నింటికి కేంద్రంగా విశాఖపట్నం విరాజిల్లుతోందని పేర్కొన్నారు.
జాతీయ ట్రంక్ రూట్, రైల్వే ట్రంక్ రూట్ కూడా విశాఖపట్టణం గుండా వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశం మేరకు న్యాయమూర్తి కెఎన్ వాంఛూ 1953 జనవరి 1న ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే విశాఖపట్టణం ఒక్కటే రాజధాని ఏర్పాటు చేసేందుకు సరైందని చెప్పారని తెలిపారు. అలాగే రాయలసీమ అభివృద్ధికి ఓ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు.