మత్తయ్యకు బెదిరింపులు: కెటిఆర్ డ్రైవర్, గన్మన్లకు అరెస్టు వారంట్లు?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలకు ఆంధ్రప్రదేశ్ సిఐడి సన్నద్ధమవుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్మెన్, కారు డ్రైవర్ విచారణకు హాజరు కాలేదు.
వారిరువురి కోసం ఎపి సీఐడీ పోలీసులు సోమవారం తమ కార్యాలయంలో ఎదురు చూశారు. కేటీఆర్ గన్మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణల ఫోన్ల నుంచి మత్తయ్యకు కాల్స్ వచ్చినట్లు సీఐడీ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు బుధవారం విశ్వప్రయత్నం చేశారు.
తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్యాంప్ ఆఫీసుకు, తర్వాత నంది నగర్లోని నివాసానికి, తర్వాత ఐఎ్సడబ్ల్యూ కార్యాలయానికి వెళ్లినా ఫలితం లభించలేదు. శుక్రవారం తెలంగాణ ఐఎస్డబ్ల్యూ చీఫ్ మహేశ్ భగవత్ వద్దకెళ్లి నోటీసులు అందించి, రశీదులు తీసుకున్నారు.
ఈ నోటీసుల మేరకు జానకిరాం, సత్యనారాయణ సోమవారంలోపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. వారు నోటీసులను బేఖాతరు చేయడంతో విజయవాడ కోర్టుద్వారా అరెస్టు వారెంటు పొందాలని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నారు.