అమరావతి శంకుస్థాపన ప్రధాన వేదిక ఖరారు: వాస్తుదోషం లేకుండా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన వేదికను అధికారరులు ఖరారు చేశారు. 80X60 అడుగుల వైశాల్యంతో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికకు తూర్పు, ఉత్తర దిశల్లో 45 అడుగుల దూరంలో శిలఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, వాస్తు దోషాలు లేకుండా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రజలు, రైతులు కోరుకున్న ప్రపంచ స్థాయిలో చంద్రబాబు రాజధానిని నిర్మిస్తారని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంతో చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఆయన చెప్పారు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మోడీ ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన కార్యక్రమంలో 11.45 నిమిషాల నుంచి 2.30 గంటల వరకు ఉంటారు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. మట్టి, కలశాలతో స్థూపాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అలాగే, ఏపీలోని అన్ని గ్రామాలు... అంటే 16వేల గ్రామాల నుంచి తెచ్చిన ధాన్యంను స్థూపంలో ఉంచాలని యోచిస్తోంది.
స్థూపంలో ధాన్యం ఉంచితే... వందల ఏళ్ల వరకు అందులో నిలువ ఉండే అంశం పైన ఏపీ ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని మంత్రి పి నారాయణ శుక్రవారం చెప్పారు. అన్ని గ్రామాల నుంచి తెచ్చిన మట్టి, కలశాలతో స్థూపం ఏర్పాటు చేస్తారు. ఈ స్థూపంలో అన్ని గ్రామాల ధాన్యం ఉంచనున్నారు.