శ్రీలక్ష్మీ కథ సుఖాంతం: ‘ఆత్మహత్య’ అంటూ వెళ్లి, పెళ్లి చేసుకుని వచ్చింది
జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆగస్టులో ఇంటి నుంచి పారిపోయిన ఆమె పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రావడం గమనార్హం.
Recommended Video
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆగస్టులో ఇంటి నుంచి పారిపోయిన ఆమె పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రావడం గమనార్హం. అయితే, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిన ఆమె సురక్షితంగా ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
ట్యూషన్లు చెబుతూ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన రామిశెట్టి అజయ్ కుమార్, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ఒకరికి వివాహమైంది. అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం అజయ్ కుమార్ మృతి చెందారు.దీంతో మిగిలిన ముగ్గురు కుమార్తెలు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
మనస్తాపంతో..
కాగా, ఇంటర్ పూర్తి చేసిన శ్రీలక్ష్మి ఖాళీగా ఉంటోంది. దీంతో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసుకోవచ్చు కదా? అంటూ అక్కలు ఆమెను నిలదీస్తుండటంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి.. ఆగస్టు 16న లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది శ్రీలక్ష్మి.
పెళ్లి చేసుకున్నా..
తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి వెతకవద్దని అందులో కోరింది. దీంతో ఆగస్టు 17న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సెప్టెంబర్ 11న శ్రీలక్ష్మి ఫేస్బుక్ ద్వారా తన కుటుంబసభ్యులకు మెసేజ్ పంపింది. తాను క్షేమంగా ఉన్నానని, వివాహం చేసుకున్నానని తెలుపడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
కథ సుఖాంతం
ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు ఫేస్బుక్ ఖాతా ద్వారా ఆమె ఆచూకీని కనుగొన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన యానాంకు చెందిన పెద్దిరెడ్డి ఈశ్వరప్రసాద్ రెడ్డి అనే యువకుడి వద్దకు వెళ్లిపోయిన శ్రీలక్ష్మి.. అతడ్ని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరినీ సత్తెనపల్లికి పోలీసులు తీసుకురావడంతో శ్రీలక్ష్మి కుటుంబసభ్యుల్లో ఆందోళన తొలగిపోయింది.