చుక్కెదురు: కారు వదిలేసిన వెళ్లిపోయిన గిడ్డి ఈశ్వరి
విశాఖపట్నం: రహదారి నిర్మించాలన్న డిమాండ్తో గిరిజనులు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని బుధవారం అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు ఎమ్మెల్యే తన కారును అక్కడే విడిచిపెట్టి ఆటోలో జన్మభూమి నిర్వహించే ప్రాంతానికి వెళ్లారు.
పాడేరు మండలం వనుగుపల్లిలో బుధవారం నిర్వహించే జన్మభూమి గ్రామ సభకు ఎమ్మెల్యే ఈశ్వరి వెళ్లాల్సి ఉంది. అయితే రహదారి సౌకర్యం లేని గిరిజనులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కందమామిడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యే ఈశ్వరి వాహనాన్ని అటకాయించారు.
తమ గ్రామాలకు రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఈశ్వరి వనుగుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదించామని, ఆ ప్రతిపాదనల ప్రతులు చూపిస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
అయినా ఆందోళనకారులు శాంతించలేదు.లిఖితపూర్వకంగా రాసివ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరి 15 రోజులలో రోడ్డు నిర్మాణం ఏలా అవుతుందని ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే ఆటోలో జన్మభూమి గ్రామ సభకు వెళ్లిపోయారు.
రాజకీయ దురుద్దేశ్యంతో అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి మీడియా ప్రతినిధులతో అన్నారు. బాలరాజు మంత్రిగా ఐదేళ్లపాటు పనిచేసి వనుగుపల్లికి ఎందుకు రోడ్డు నిర్మించలేకపోయారని ఆమె ప్రశ్నించారు.