స్వగ్రామంలో దీక్ష విరమించిన ముద్రగడ: దాసరి, చిరుతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం
కిర్లంపూడి: తుని ఘటనలో బాధ్యులంటూ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కాపు కార్యకర్తలను విడుదల చేయాలంటూ గత 14 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో ముద్రగడ తన స్వగ్రామమైన కిర్లంపూడిలో దీక్షను విరమించారు.
తుని ఘటనలో ఇటీవలే జైలు నుంచి విడుదలైన 13 మంది కాపు కార్యకర్తలతో పాటు పలువురు కాపు నేతలు ముద్రగడకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అయితే బుధవారం ఉదయం రాజమండ్రి ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరే ముందు కాపు నేతలైన దాసరి నారాయణరావు, చిరంజీవిలతో ఆయన ఫోన్లో మంతనాలు జరిపారు.
అనంతరం వారిద్దరి సూచనల మేరకు దీక్ష విరమణకు అంగీకరించిన ముద్రగడ పద్మనాభం తన సతీమణితో కలిసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి బయల్దేరారు. కాగా దీక్ష విరమణకు ముద్రగడ ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది.
తనను, జైలు నుంచి విడుదలైన 13 మంది కాపు కార్యకర్తలను పోలీసు వ్యాన్లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతులు పెట్టినట్లుగా సమాచారం. అయితే దీక్ష విరమణకు పెట్టిన షరతులను చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఆయన షరతులను అంగీకరించామని, కొత్త వాటిని ఒప్పుకోబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఇక దీక్ష విరమించి ఇంటికి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సమాచారం. దీంతో పోలీసులు ముద్రగడను తరలించే పరిస్థితి లేకపోవడంతో అనుచరులే ఆయనను సొంత వాహనంలో కిర్లంపూడికి తీసుకెళ్లారు.
దారిలో ఎక్కడా ఊరేగింపులు, ఇతర ప్రదర్శనలు జరగకుండా ముందుగానే ముద్రగడ వెళ్లే మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆయనకు భారీ భద్రత కల్పించారు. రాజమండ్రి నుంచి ముద్రగడ వెళ్లే రోడ్డు మొత్తం ముందుగానే క్లియర్ చేసి, ర్యాలీలు జరగకుండా నేరుగా రాజమండ్రి నుంచి కిర్లంపూడి వెళ్లేలా చూస్తున్నారు.
ముద్రగడ అభిమానులు కొంతమంది ఇప్పటికే కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. తుని ఘటనలో ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం అరెస్ట్ చేసిన కాపులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్తో ముద్రగడ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
అయితే తొలి రోజునే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అలా ఆసుపత్రిలోనే 14 రోజుల పాటు ముద్రగడ పద్మనాభం తన దీక్షను కొనసాగించిన సంగతి తెలిసిందే.