ఫలితాలు, తెలంగాణపై నారా లోకేష్, రోజా భావోద్వేగం
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలుపు నేపథ్యంలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే తమ పార్టీ అధినేతను గెలిపించారన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు బాగా ప్రచారం చేశారన్నారు. ముఖ్యంగా కార్యకర్తల వల్లనే పార్టీ నిలబడిందని చెప్పారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడే వారు వీడారని, వచ్చే వారు వచ్చారన్నారు. తాను మొదటి నుండి తమ పార్టీ గెలుస్తుందని చెప్పానన్నారు.
తన విషయమై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు, ప్రాదేశిక ఫలితాలు టిడిపికి అనుకూలంగా వచ్చాయన్నారు. ఆ తర్వాత పవన్, మోడీలు ఇంకా బాగా చేశారన్నారు.
తెలంగాణ ఫలితాల పైన...
తెలంగాణ ప్రాంతాలో చాలామంది నాయకులు పార్టీలు వెళ్లారు, ఇంకొందరు వచ్చారన్నారు. కానీ కార్యకర్తలు తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తల వల్లనే తెలంగాణలో పార్టీ నిలబడిందని చెప్పారు.
కాగా, టిడిపి గెలుపు నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. సీమాంధ్ర సిఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
రోజా భావోద్వేగం
నగరి నియోజకర్గం నుండి గెలుపొందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రోజా భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో రెండుసార్లు టిడిపిలో తనకు వెన్నుపోటు పొడిచారని, ప్రజలు ఈసారి తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు.