విశాఖ చాలు: చంద్రబాబుపై నేపాల్ మంత్రి ప్రశంసలు, నితిన్, బాబు ఏం చెప్పారంటే..?
‘మీ సమర్థ పాలనా పటిమను విశాఖ నగరమే చాటుతోంది’ అని నేపాల్ వాణిజ్య మంత్రి తకాలి చంద్రబాబుతో అన్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సీఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడులనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడుపై ప్రశంసలను కూడా తెస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిపై ప్రశంసించగా.. ఇప్పుడు నేపాల్ దేశానికి చెందిన ఓ మంత్రి బాబును పొగడ్తలతో ముంచెత్తారు.
'మీ సమర్థ పాలనా పటిమను విశాఖ నగరమే చాటుతోంది' అని నేపాల్ వాణిజ్య మంత్రి తకాలి చంద్రబాబుతో అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన తకాలితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తకాలి మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తిని పొందానని చెప్పడం గమనార్హం.
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఆయన ఐటీని ఏ విధంగా అభివృద్ధి చేసింది తనకు తెలుసన్నారు. విశాఖ, విజయవాడలో ఎంతోమంది నేపాలీ విద్యార్థులు ఐటీ, హాస్పిటాలిటీ కోర్సులలో వున్నారని స్పష్టం చేశారు. మార్చిలో నేపాల్లో జరగబోయే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరై, అనుభవాలను తమతో పంచుకోవాలని తకాలి చంద్రబాబును ఆహ్వానించారు.
చంద్రబాబు కోరారు.. మేం చేస్తాం: నితిన్ గడ్కరీ
సదస్సులో భాగంగా పారిశ్రామిక కారిడార్పై నిర్వహించిన సెషన్లో కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలరవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పంజాబ్ ఎన్నికల తర్వాత బకింగ్ హామ్ కెనాల్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
'విశాఖ పోర్టు లాభాలను బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధికి ఉపయోగిస్తాం. జల రవాణాకు భూ సేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ సమస్య ఉండదని భావిస్తున్నా. ఏపీలో 2లక్షల కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించాలనుకున్నాం. ఇప్పటికే రూ.1.70లక్షల కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించాం. సాగర్మాల ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. ఈ ప్రాజెక్టులో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు.
'80శాతం ట్రాఫిక్ జాతీయ రహదారులపైనే ఉంది. పోర్టు ఆధారిత అభివృద్ధి మాలక్ష్యం. రెండు తీరప్రాంత ఆర్థిక కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. విశాఖ పోర్టు వద్ద రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఏపీలో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడులు మాలక్ష్యం. అనంతపురం-అమరావతి రహదారి పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తాం. చంద్రబాబు కోరిన రాయపూర్-విశాఖ రహదారి పనులనూ చేపడతాం. రాయపూర్-విశాఖ ప్రాజెక్టు వ్యయం రూ.5వేల కోట్లు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం' అని గడ్కరీ వివరించారు.
అమరావతిలో అద్భుతమైన రింగ్ రోడ్డు: నితిన్ గడ్కరీకి చంద్రబాబు ప్రశంస
దేశంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రవాణా మార్గాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఐఐ రెండో రోజు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో రెండు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏరంగం అభివృద్ధి చెందాలన్నా ముందు రహదారులు అభివృద్ధి చెందాలి' అని అన్నారు.
'రాష్ట్రంలో అన్ని పోర్టులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం. విశాఖ-రాయపూర్ మధ్య మలుపులు లేని 6 లేన్ల రహదారి నిర్మించాలని కోరుతున్నాం. రహదారికి సమాంతరంగా రైల్వే లైను కూడా ఏర్పాటు చేయాలి. దేశంలో అత్యుత్తమ రహదారుల నిర్మాణానికి గడ్కరీ చేస్తున్న కృషి అభినందనీయం. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, డిఫెన్స్, లైవ్స్టాక్, ఆక్వా.. ఇలా అన్నింటా సానుకూల వాతావరణం ఉంది. నంబర్వన్ రాష్ట్రంగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.' అని చెప్పారు.
మేకిన్ ఇండియా పేరుతో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. మౌలిక సదుపాయాలుంటేనే పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయని అన్నారు.
అమరావతిలో అద్భుతమైన రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు హైదరాబాద్కు రహదారులు అనుసంధానం చేయడం జరిగిందని చెప్పారు. అమరావతి నుంచి బెంగళూరుకు రవాణా మార్గం నిర్మాణం జరుగుతోందని వివరించారు. రవాణా ఖర్చులు తగ్గించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా రాస్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న నితిన్ గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.