ఆయేషా హత్య కేసులో ట్విస్ట్: సత్యంబాబు నాడేం చెప్పాడంటే..! తవ్వుతున్న పోలీసులు
అయేషా మీరా హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్. ఈ కేసులో సత్యంబాబును ఎనిమిదేళ్ల తర్వాత హైకోర్టు నిర్దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అతను రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.
విజయవాడ: అయేషా మీరా హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్. ఈ కేసులో సత్యంబాబును ఎనిమిదేళ్ల తర్వాత హైకోర్టు నిర్దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అతను రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇదీ నా బాధ్యత, అయేషా పేరెంట్స్కు థ్యాంక్స్: సత్యంబాబు విడుదల, ఉద్వేగం
కానీ ఈ కేసులో సత్యం బాబు నూటికి నూరుపాళ్లు దోషేనని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. తాము అన్ని ఆధారాలను ప్రవేశ పెట్టినప్పటికీ హైకోర్టులో కేసు ఎందుకు వీగిపోయిందోనని పోలీసులు కారణాలను అన్వేషిస్తున్నారు.
దీంతో సత్యం బాబు కేసు మళ్లీ మొదటికి వచ్చేటట్లుగా కనిపిస్తోంది. కేసును తిరగదోడేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అసలు ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి నాడు సత్యం బాబు మీడియాతో ఏమన్నాడో కూడా చూస్తున్నారు.
అంతకుముందు సత్యం బాబు మాట్లాడుతూ.. ఆయేషా మీరా హత్యతో తనకు సంబంధం లేదని, పోలీసులు బెదిరించడం వల్లే చేయని నేరాన్ని అంగీకరించానని చెప్పారు. తన తల్లిని, చెల్లిని ఎన్కౌంటర్ చేస్తామని దర్యాఫ్తు అధికారులు బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.
అయితే, సత్యం బాబు ఆరోపణలను పోలీసులు కొట్టి పారేశారు. ఇన్వెస్టిగేషన్ అధికారు రంగనాథ్ ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయేషా మీరాను సత్యం బాబు హత్య చేసినట్లు స్వయంగా వెల్లడించారన్నారు.
చాలా నేరాల్లో అతను నిందితుడు అన్నారు. బాధితులను విచారిస్తే నేరాల చిట్టా బయటపడుతుందన్నారు. సత్యం బాబును ఇరికించామనేది అబద్దమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందో చూడాలన్నారు. సత్యం బాబును అరెస్ట్ చేశాక నందిగామలో ఒక్క నేరం జరగలేదన్నారు.
న్యాయం చేస్తామని నన్నపనేని హామీ
ఇదిలా ఉండగా, ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి నందిగామ శివారు అనాసాగరంలో సత్యం బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలు, పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు?, ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగి తెలుసుకున్నారు.
ఎన్కౌంటర్ చేస్తామన్నారు..
తల్లిని, చెల్లిని ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని, తనను చిత్రహింసలకు గురి చేశారని సత్యం బాబు వారితో చెప్పారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని, మీకే చెబుతున్నానని తెలిపారు. అనంతరం నన్నపనేని మాట్లాడారు. కోర్టు తీర్పుపై కొందరు అధికారులు అవహేళనగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో వాస్తవానికి విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం
ఆయేషా మీరా హత్య కేసులో నిందితులను గుర్తించి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా సత్యం బాబును అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పడే తాను సత్యంబాబు నిందితుడు కాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నంలోని హాస్టల్ నిర్వాహకులను సక్రమంగా విచారించలేదన్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు తనకు బాగా తెలుసునని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.
ఇంక్రిమెంట్లు రద్దు చేయాలి
సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో అతనిని నిందితుడిగా పట్టుకున్న పోలీసులకు ఇచ్చిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రద్దు చేయాలని కులవివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్యాద్రి డిమాండ్ చేశారు. అనాసాగరంలో సత్యం బాబును, ఆయన తల్లి మరియమ్మను కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు పరామర్శించారు. అనంతరం గ్రామంలో కాలిపోయిన సత్యంబాబు ఇంటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యంబాబు కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గ్రామంలో ఆయనకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.