వాడరేవు పోర్టు నిర్మాణం, బాబుకు లేఖ: నితిన్ గడ్కరీ, ‘ఏపీకి 4లక్షల కోట్లు మంజూరు’
Recommended Video
విశాఖపట్నం: ప్రకాశం జిల్లా వాడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి తాము సిద్ధమని కేంద్ర షిప్పంగ్ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు.విశాఖ పోర్టుకి కొత్తగా భూమి లభించే అవకాశం లేనందున ఈ పోర్టుపై ఒత్తిడి తగ్గాలంటే కొత్త పోర్టు అవసరమని ఆయన చెప్పారు.
విశాఖలో రెండు రోజుల పాటు దేశంలోని మేజర్ పోర్టుల పనితీరు, ఈ ఏడాది అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఆయన సహాయ మంత్రులతో కలిసి శుక్రవారం సమీక్షించారు. సమీక్ష వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోర్టుల అభివృద్ధి
పోర్టుల అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించామని, ఇందులో భాగంగానే ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అన్ని పోర్టుల సదుపాయాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ వెల్లడించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు అన్ని పోర్టుల్లో చేయాలని, ప్రయోగాత్మకంగా చేసిన ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చిందని వివరించారు.
ఏపీకి 4లక్షల కోట్లు
ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. కాగా, సాగర్ మాల, భారత్ మాల ప్రాజెక్టుల వల్ల దేశంలో జలరవాణా పూర్తిస్థాయిలో అభివృద్ది చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టులు, ఇతర పథకాల కింద రూ.4లక్షల కోట్లకు పైగా మంజూరు చేసినట్టు వివరించారు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ ఆలోచన లేదు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరించే యోచన లేదన్నారు. విశాఖ, పారదీప్, న్యూమంగళూరు పోర్టులు దీని బాధ్యతను తీసుకుంటాయన్నారు. డీసీఐని బలోపేతం చేయడమే మా లక్ష్యమని, దీనికి సంబంధించి కెబినెట్ నోట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. డీసీఐ సేవల్లో మరింత పోటీ పెంచి, మరికొన్ని ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కరీ తెలిపారు.
పోర్టుల ఆధునీకరణ
పోర్టుల ఆధునీకరణ, యాంత్రీకరణంగా గైడ్ చేసేందుకు మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు నీరు సముద్రంలో చేరకుండా సీవెజ్ ప్లాంట్ల నిర్మాణం అన్నీ పోర్టులకు తప్పనిసరి చేశామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.