టి టైంకి 'ప్రత్యేక': జగన్ క్లియర్, బాబు, కిరణ్లపై సస్పెన్స్
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. విభజన బిల్లు భాషా సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బిల్లు నిబంధనల ప్రకారం ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉండాలి. కానీ ఢిల్లీ నుండి కేవలం ఆంగ్ల ప్రతులు మాత్రమే వచ్చాయి.
దీంతో విభజన బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టినా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భాషా సమస్యను చూపించి అడ్డుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెడతారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో చెప్పారు. దీంతో భాషా సమస్యను పక్కన పెట్టి కేవలం ఆంగ్ల ప్రతులను మాత్రమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013ను సోమవారమే అసెంబ్లీలో ప్రవేశపెట్టినా దానిపై అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. బిల్లు తమకు వచ్చినట్లుగా సభాపతి నాదెండ్ల మనోహర్ శాసన సభలో ప్రకటిస్తారు. రాష్ట్రపతి నుండి వచ్చి లేఖను అసెంబ్లీ కార్యదర్శి సభలో చదువుతారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ్యులకు ఆంగ్ల ప్రతులను వ్యక్తిగతంగా ఇచ్చే అవకాశాలున్నాయి.
అనంతరం బిఎసి సమావేశమై విభఝన బిల్లును అసెంబ్లీలో ఎప్పుడు చర్చించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ బిఎసి తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. బిఎసిలో పార్టీలకతీతంగా ప్రాంతాలుగా నేతలు విడిపోయే అవకాశాలున్నాయి. వెంటనే చర్చ జరపాలని తెలంగాణ ప్రాంత నేతలు పట్టుబడతారు. సమైక్య తీర్మానం చేయాలని, భాషా సమస్యను చూపించి సీమాంధ్ర ప్రతినిధులు తాత్సారం చేయించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల అజెండాను ఇప్పటికే ఖరారు చేసేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 11న జరిగిన బిఎసిలో దానిని నిర్ణయించారు. ముసాయిదా బిల్లు రానున్నందున రాష్ట్ర విభజనపై అభిప్రాయ సేకరణ కోసమే సమావేశాలను నిర్వహించాలని ఇతర ఏ అంశాలపైనా చర్చ వద్దని ఆ సమావేశంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు పట్టుబట్టారు. బిల్లు వచ్చిన వెంటనే శాసన సభలో ప్రవేశపెడతానని స్పీకర్ మనోహర్ హామీ ఇవ్వడంతో ప్రజా సమస్యలపై చర్చించేందుకు వారు అంగీకరించారు. ఇప్పుడు బిల్లు వచ్చింది. దీంతో బిల్లుపై చర్చకు తెలంగాణ నేతలు పట్టుబట్టే అవకాశముంది.
తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు ప్రతులను తెలుగు, ఉర్దూల్లో ప్రచురించి సభ్యులకు ఇస్తారని, వాటిని అధ్యయనం చేసేందుకు కొంత సమయం ఇస్తారని, ఆ తర్వాత అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ముఖ్యమంత్రి ఇదే అభిప్రాయంతో ఉన్నారట. అయితే దీనికి తెలంగాణ నేతలు ససేమీరా అంటున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఈ నలభై రోజులను ఉపయోగించుకొని, మరికొంత గడువు కోరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిల్లుపై స్పష్టతతో ఉన్నారు. బిల్లు అసెంబ్లీకి వస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. కిరణ్ విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ అధిష్టానం మాటకు కట్టుబడి చివరి నిమిషంలో అసంతృప్తిగానైనా ముందుకు వెళ్తారా లేక రాజీనామా చేస్తారా అనే చర్చ సాగుతోంది.
ఇక చంద్రబాబు సభలో ఏం చేస్తారనే అంశం అందరిలోను ఎక్కువ ఉత్కంఠను కలిగిస్తోంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో తాము ఏం చేయాలో తెలుసునని చంద్రబాబు ఇటీవల చెప్పారు. ఇది అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమైక్య సమస్యలు చెప్పి తెలంగాణకు ఓకే చెబుతారా? లేక అనూహ్య నిర్ణయం ఏదైనా తీసుకుంటారా? తెలంగాణ ప్రాంత నేతలు ఎలాగు బిల్లుకు అనుకూలంగా ఉంటారు. దీంతో సీమాంధ్ర టిడిపి నేతలు బాబు చెప్పినట్లుగా నడుచుకుంటారా లేక ఏం చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది.