నా చేతుల్లో లేదు, పరిస్థితి చేయి దాటింది ఐనా: కిరణ్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రంపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, అయితే తన వంతుగా విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఎపిఎన్జీవోలతో చెప్పారు. సమ్మె విరమణపై ముఖ్యమంత్రితో ఎపిఎన్జీవో నేతలు మధ్యాహ్నం చర్చలు సాగాయి.
ఈ సమయంలో సమ్మె విరమించాల్సిందిగా ఎపిఎన్జీవోలను ముఖ్యమంత్రి కోరారు. విభజన జరగదని కేంద్రం తరఫున హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ... విభజన జరగదని తాను కేంద్రం తరఫున ఎలాంటి హామీ ఇవ్వలేనని చెప్పారు.
విభజన అంశం తన పరిధిలో లేదన్నారు. పరిస్థితి చేయి దాటిపోయందన్నారు. అదే సమయంలో విభజనను అడ్డుకునేందుకు తనవంతుగా తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. చివరి వరకు పోరాటంలో మీతో ఉంటానని చెప్పారు. 2014 వరకు రాష్ట్రం విడిపోదని ఎపిఎన్జీవోలకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందాన్ని(జివోఎం)ను కలవాలని సూచించిన సిఎం తాము కూడా కలుస్తామని చెప్పారు. కేంద్రం తరఫున హామీ ఇవ్వలేనని చెప్పిన కిరణ్ మొదటి నుండి 2014 వరకు విభజన జరగదని చెబుతున్న విషయం తెలిసిందే.
సమ్మె విరమణ
ప్రజల ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం ప్రకటించింది. పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కూడా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపింది.