సీమాంధ్రకి న్యాయం జరిగితేనే టి: మురళీధర్, కవిత ఫైర్
హైదరాబాద్/విజయవాడ: సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు సోమవారం అన్నారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతం పాకిస్తాన్, బంగ్లాదేశ్లో లేవన్నారు.
సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కూడా తమ పార్టీకి ముఖ్యమేనన్నారు. విభజన అంశంపై కాంగ్రెసుకు స్పష్టత లేదని, రోజుకో మాట మారుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా బిల్లు లోపభూయిష్టంగా ఉంటే తాము సమర్థించేది లేదని మురళీధర రావు ఈ సందర్భంగా అన్నారు.
చిత్తూరు బ్రదర్స్ నాటకం: కవిత
తెలంగాణ బిల్లును వెనక్కి పంపించారని చిత్తూరు బ్రదర్స్(ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు)లు అసెంబ్లీ సాక్షిగా నాటకాలు ఆడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాదులో అన్నారు. కిరణ్ బాబు, చంద్రబాబు, జగన్ బాబు ముగ్గురితో పాటు వారి వెనుక ఉండి ఆడిస్తున్న కనిపించని నాలుగగో ముఖంగా ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులందరూ తెలంగాణను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు.
ఆరువందల కోట్ల రూపాయల విలువ చేసే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని చంద్రబాబు ఓ సీమాంధ్ర పెట్టుబడిదారుకు అరవై కోట్ల రూపాయలకే అమ్మేశారని, అదే ఫ్యాక్టరీని నేడు కిరణ్ రూ.200 కోట్లు ఇచ్చి ఆ సీమాంధ్ర పెట్టుబడిదారు నుంచి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడటంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ టైం నుండే సీమాంధ్రకు చెందిన విద్యాసంస్థలు వెల్లువలా వచ్చి విద్యాపేరిట వ్యాపారం సాగిస్తున్నాయన్నారు.