బాబు ఏడ్చారా, కనిపించలేదు: పార్థసారథి, మా నీళ్లు మా ఇష్టం: టిఆర్ఎస్ బూర
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కర ఘటన పైన క్షమాపణ చెప్పినట్లు గానీ లేదా కంటతడి పెట్టినట్లు గానీ ఎక్కడా కనిపించలేదని వైసీపీ నేత పార్థసారథి గురువారం అన్నారు.
చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం, వివిఐపీలను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందుకే అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారన్నారు. పుష్కరాల కమిటీలలో సీనియర్లకు అవకాశం ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు నాయుడు మొదట రాజీనామా చేయాలని, ఆ తర్వాత అధికారుల పైన చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు భక్తులు క్రమశిక్షణతో ఉండాలని చెబుతున్నారని, కానీ ఆయనకే మొదట క్రమశిక్షణ లేదనే విషయం గుర్తించాలన్నారు.
భక్తులు క్రమశిక్షణ పాటించాలి: చంద్రబాబు
కొవ్వూరులో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ ఏర్పాట్లతో పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం పుష్కర ఘాట్ను సందర్శించి, ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాజమండ్రి, కొవ్వూరులలో అన్ని సాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. భక్తులు క్రమశిక్షణతో పుష్కర స్నానాలు చేయాలన్నారు.
చంద్రబాబుపై టిఆర్ఎస్ ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన టిఆర్ఎస్ ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు ఆపడం దురదృష్టమన్నారు. మా నీళ్లు మేం అడుగుతున్నామని చెప్పారు. మా నీళ్లు మేం దేనికైనా వాడుకుంటామని, దీనిపై అడగడానికి చంద్రబాబు ఎవరన్నారు. గాలేరు నగరికి అనుమతి ఉందా అని ప్రశ్నించారు.