కెసిఆర్ ఎక్కడ, తన్ని తరిమారు: కెటిఆర్కు పయ్యావుల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మార్పిడి సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎక్కడున్నారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో చర్చ జరుగుతుండగా తెరాస శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతుండగా గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో పయ్యావుల మాట్లాడారు.
ఓ వైపు సంతోషం, మరోవైపు బాధ ఉన్న సమయంలో సంయమనం ఎటు వైపు ఉండాలని ప్రశ్నించారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని సూచించారు. ఎన్టీఆర్ను దించేశారని కెటిఆర్ చెబుతున్నారని, అప్పుడు ఆయన తండ్రి కెసిఆర్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఆయనే మొదటి వ్యక్తి అన్నారు. తెరాస చర్యలు వెలుగులోకి తెస్తే ఏం చేయాలో వారికి పాలుపోదన్నారు. చరిత్రలోకి వెళ్తే... అని హెచ్చరించారు.
2004లో తాము సమైక్యవాదంతో ముందుకెళ్లామని, 2009లో తెలంగాణకు అనుకూలమని ఎన్నికలకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో గుర్తించాలన్నారు. కెటిఆర్ తమ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టుకొని తమ నోళ్లు కట్టేశారన్నారు.
కెటిఆర్ చెప్పిన మట్టి బొమ్మలు సి నారాయణ రెడ్డి చైర్మన్గా, కెసిఆర్ సభ్యులన్నారు. కెటిఆర్ మాటల్లో జాత్యాహంకార ధోరణి ఉందన్నారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన వారంతా తమ బిడ్డలే అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన చేస్తే తన్ని తరమేసిన చరిత్ర అని, తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు వారిని విడిపించుకొచ్చారన్నారు. తెలంగాణ పేరు మీద రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఓట్లు, సీట్లతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.