ఎగరడానికి సిద్ధమైన రాణ్ చరణ్ తేజ విమానాలు
హైదరాబాద్: తెలుగు సినీ హీరో, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజకు చెందిన విమానయాన సంస్థ ట్రూజెట్ (టర్బో మేఘా ఎయిర్వేస్) తన సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంది. ట్రూజెట్ బ్రాండ్తో కూడిన 72 సీట్ల ఎటిఆర్ విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగింది. మలేషియాలోని సుబాంగ్ ఎయిర్పోర్టు నుంచి మయన్మార్ మీదుగా ఈ విమానం రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంది.
పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) అనుమతులకు లోబడి, వాణిజ్య సర్వీసులను లాంఛనంగా జూన్ ఆఖరు వారంలో లేదా జూలైలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్ధ, ట్రూజెట్ పేరుతో విమాన సేవలు ప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ 2014లోనే అనుమతులు ఇచ్చింది. రెండు ఎటిఆర్ విమానాల కొనుగోలుకు సంస్థ అనుమతులు పొందింది.
సాంకేతికపరంగా, నాణ్యతాపరంగా ప్రమాణాలన్ని సంతృప్తికరంగా ఉండేవిధంగా చూసుకున్న తర్వాతే వాణిజ్యపరంగా సర్వీసులను ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. సర్వీసుల ప్రారంభానికి సంబంధించి సంస్థ అధికారికంగా మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్కు వంకాయలపాటి ఉమేశ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తొలిదశలో 8 పట్టణాలకు పరిమితమైనప్పటికీ క్రమంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సుమారు 18 ద్వితీయ శ్రేణి నగరాలకు సర్వీసులను విస్తరించే యోచనలో ట్రూజెట్ ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మధురై, బెల్గాం, హుబ్లీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కడప, కోయంబత్తూర్, ట్యుటికోరిన్, సేలం వంటి నగరాలకు విమానయాన సేవలు అందించాలని ట్రూజెట్ నిర్ణయించింది.
పౌర విమానయాన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి వెసులుబాటు కల్పించిన తర్వాత, రంగంలోకి దిగిన తెలుగువారి సంస్థల్లో టర్బో మేఘా ఎయిర్వేస్ రెండోది. విజయవాడ కేంద్రంగా ఎయిర్కోస్టా విమానయాన సర్వీసులను ఇప్పటికే అంది స్తోంది. టర్బో మేఘా ఎయిర్వేస్ మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించనుంది. టర్బో మేఘా ఎయిర్వేస్ను ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసుల్లోని టర్బో ఏవియేషన్ ప్రమోట్ చేసింది.