బైర్లు కమ్మే ఆస్తులు: రఘు అక్రమాల్లో ఐఏఎస్ కుమార్తె?, సంచలనమే!..
అనర్హులకు పదోన్నతులు కట్టబెట్టడం ద్వారా కూడా రఘు భారీగా లంచాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనర్హులైన 50 మంది అధికారులకు పదోన్నతులు కట్టబెట్టేందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు.
Recommended Video
అమరావతి: టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘురామిరెడ్డి అక్రమాస్తులు ఏసీబీ అధికారులనే నోరెళ్లబెట్టేలా చేశాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వంద కోట్ల కొద్ది ఆస్తులకు పడగెత్తడం వారిని షాక్ కు గురిచేసింది.
సోమవారం అర్ధరాత్రి వరకూ జరిపిన సోదాల్లో మరో 3 కిలోల బంగారం బయటపడింది. మంగళవారం నాటికి మొత్తం 11 కిలోల బంగారం, 25 కిలోల వెండి, వజ్రాల నగలు గుర్తించినట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు.
ఎనిమిది కంపెనీలు:
బినామీల పేర్ల మీద రఘు ఎనిమిది ప్రైవేటు కంపెనీలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో సాయి సదన్ ఇన్ఫ్రా, సాయిసుధ ఎవెన్యూస్, సెవరీ బిల్డర్స్, శ్రీమాత ఇన్ఫ్రా, సాయిసూరజ్కుంజ్ హోటల్స్, షిరిడీలోని సూరజ్కుంజ్ కాంప్లెక్స్, సాయి అనాథ శరణాలయం(షిరిడి), గన్నవరంలో నల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఉన్నట్లు తేలింది.
ఏసీబీకే షాక్: బంగారం గుట్టలు, నోట్ల కట్టలు: విదేశాల్లో రిటైర్మెంట్ పార్టీ(పిక్చర్స్)
భారీ ఉద్యానవనం:
వెంకట సుబ్బారావు అనే బినామీ పేరుతో రఘు కంపెనీలు నడుస్తున్నాయి. గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలోని రావ్ఫిన్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్లో రఘు కుటుంబంతో సేదతీరేందుకు ప్రత్యేకంగా ఓ భారీ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇక్కడే రూ.30 లక్షల వ్యయంతో ఓ పిరమిడ్ హౌస్ను నిర్మించుకున్నారు. ఈ పిరమిడ్ను మొత్తం రాగితో తయారు చేయించారు. ఇక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులకు బినామీగా ఉన్న శివప్రసాద్ ఇంటి పేరు 'నల్లూరి'తో ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. విజయవాడకు సమీపాన ఉన్న కంకిపాడులో రియల్ ఎస్టేట్పై రఘు భారీగా పెట్టుబడులు పెట్టాడని సమాచారం.
సుబురి డైరెక్టర్గా ఐఏఎస్ కుమార్తె:
రఘు సృష్టించిన బినామీ కంపెనీల్లో ఒకటైన సుబురి బిల్డర్స్కు ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ కుమార్తె సుమేధ శర్మ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర గృహనిర్మాణ, పేదరిక నిర్మూలనశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు.
ఆయన విజయవాడ మునిసిపల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో రఘు, శివప్రసాద్ లతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వల్లే సమీర్ శర్మ కుమార్తెను రఘు తన కంపెనీకి డైరెక్టర్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ స్థాపనలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించి, తద్వారా వచ్చిన డబ్బును సుబురి కంపెనీలో పెట్టుబడి పెట్టానని చెబుతున్నారు.
భారీగా ఆస్తులు:
విజయవాడలో రెండు చోట్ల నివాస స్థలాలు, అలాగే చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో మేనకోడలు పేరిట ఒక ఇంటి స్థలం, మంగళగిరిలో అత్తగారి పేరిట మరో ఇంటి స్థలాన్ని అధికారులు గుర్తించారు. చిత్తూరు, విజయవాడలోని బ్యాంకుల్లో భార్య కల్పలత, కుమార్తె ప్రత్యూష పేరిట ఉన్న ఖాతాల్లో రూ.60 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. ఆ మొత్తాన్ని డ్రా చేసే అవకాశం లేకుండా సంబంధిత బ్యాంకులకు లేఖలు రాసినట్లు తెలిపారు.
అవి బయటపడితే?:
ఇప్పటి వరకూ జరిగిన సోదాల్లో ఏసీబీ అధికారులు ఒక్క బ్యాంకు లాకర్ను కూడా గుర్తించలేదు. దీంతో బ్యాంకు లాకర్లకు సంబంధించిన సమాచారం బయటపడితే ఈ అవినీతి డొంక మరింత బట్టబయలయ్యే అవకాశం ఉంది.
అనర్హులకు పదోన్నతులు,:
అనర్హులకు పదోన్నతులు కట్టబెట్టడం ద్వారా కూడా రఘు భారీగా లంచాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనర్హులైన 50 మంది అధికారులకు పదోన్నతులు కట్టబెట్టేందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.20లక్షలు, మొత్తంగా సుమారు రూ.10 కోట్లు వారి నుంచి వసూలు చేసినట్లు సమాచారం.
అలా దొరికాడు:
పదోన్నతుల విషయంలో సంబంధిత శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకుండా రఘు నిర్ణయాలు తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ పదోన్నతుల విషయంలో సహోద్యోగితో రఘుకు విభేదాలు తలెత్తాయి. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. అయితే రఘు వ్యవహారంపై తీవ్ర అసహనంతో ఉన్న ఆయన స్వయంగా ఏసీబీకి సమాచారం అందించారు. దీంతో రఘు అవినీతి బాగోతం బయటపడింది.