రిషితేశ్వరిని మరో విద్యార్థితో ఏకాంతంగా వదిలేశారు: ర్యాంప్ వాక్లు
గుంటూరు: రిషితేశ్వరి ఘటనపై ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ పూర్తి నివేదికను ప్రభుత్వం ముందుంచింది. ఈ కమిటీ విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ వేధింపుల కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ తేల్చింది. విద్యార్థిని రిషితేశ్వరిని ఏకాంతంగా మరో విద్యార్థి వద్ద వదిలిపెట్టి ఏడిపించారని, అయితే సహ విద్యార్థులెవ్వరూ ఆ అమ్మాయికి సహాయం చేయలేకపోయినట్లు నివేదిక వెల్లడించింది.
కమిటీ పలు సూచనలు చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సిఫార్సులు చేసింది. రిషితేశ్వరి కేసుపై కచ్చితంగా న్యాయవిచారణ చేపట్టాలని స్పష్టంచేసింది. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి జూలై 14వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రిన్సిపాల్ జి బాబూరావు ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి మృతి చెందినట్లు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన తర్వాత ప్రకటించాలని వైద్యులను ఒత్తిడి చేసినట్లు కమిటీ నివేదికలో వెల్లడైంది.
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నతర్వాత విశ్వవిద్యాలయానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చిన సమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించాలని కొందరు సీనియర్ విద్యార్థులను ప్రేరేపించారని కమిటీ తెలిపింది. విద్యార్థిని రిషితేశ్వరి ఉన్న హాస్టల్ రూమ్లో గల తోటి విద్యార్థినులు మౌనిక, పావని, ఉన్నతిలను తప్పనిసరిగా విచారించాలని నివేదికలో కోరారు.
హాస్టల్ రూమ్ నుంచి రిషితేశ్వరిని బలవంతంగా ఖాళీ చేయించి రాత్రి మొత్తం బయటే నుంచోబెట్టిన సీనియర్ విద్యార్థినులు గౌతమి, లక్ష్మీదుర్గ, షేక్ నస్రలపై కూడా విచారణ చేపట్టాలన్నారు. రిషితేశ్వరి తండ్రి ఎం మురళీకృష్ణ ర్యాగింగ్పై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని స్పష్టంగా కమిటి అభిప్రాయపడింది.
హాస్టల్లో ర్యాగింగ్ దారుణంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా మృతి చెందలేదని, ప్రేమ వేధింపులే కారణమని, అయితే ర్యాగింగ్ జరుగుతున్న తీరు గమనిస్తే నరకయాతన గుర్తుకు వస్తుందన్నారు. హాస్టల్లోని జూనియర్ విద్యార్థినులను సీనియర్లు క్యాట్వాక్, ర్యాంప్వాక్ చేయించి ఆ ఫొటోలు, వీడియోలను వాట్సప్లో సీనియర్ బాయ్స్కు పంపేవారని తెలిపారు.
సీనియర్ బాయ్స్కు జూనియర్ విద్యార్థినులతో ఫోన్లు చేయించి మాట్లాడించేవారన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని ఒత్తిడికి గురిచేసి, వేధింపులకు గురిచేసేవారని కమిటీ తెలిపింది. నిందితులు శ్రీనివాస్, జయచరణ్, దుంపా అనీషాలతో పాటు అనీషా స్నేహితులు అవినాష్, జితేంద్రలను కూడా విచారించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది.
రిషితేశ్వరి ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదని, ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు. ప్రిన్సిపాల్ కళాశాల ప్రాంగణంలో ర్యాగింగ్ను ప్రోత్సహించే విధంగా వ్యవహరించేవాడన్నారు. అంతేకాకుండా రిషితేశ్వరి కేసులో నిందితులైన వారిని రక్షిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు నివేదికలో తెలిపారు.
ఈ పరిస్థితిలో ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ అవసరమైందని కమిటీ అభిప్రాయపడింది. కళాశాలను ర్యాగింగ్ నుంచి దూరం చేసేందుకు ప్రిన్సిపాల్, వార్డెన్లపై తప్పక చర్యలు చేపట్టాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.