పుష్కరాలు: దొంగల్ని బోట్లో చేజ్ చేసి పట్టుకున్నారు, అర్ధరాత్రి బాబు తనిఖీ
రాజమండ్రి: పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా దొంగలు కూడా చెలరేగుతున్నారు. రాజమండ్రిలోని ఓ ఘాట్ వద్ద దొంగలు తమ చేతివాటం చూపించారు. అయితే, భక్తులు అరవడం, పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.
అయితే, భద్రతా సిబ్బంది ఆ దొంగలను చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది పడవలో దొంగలను చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. దొంగల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మహాపుష్కరాల వైభవంగా సాగుతున్నాయి. గోదావరి తీరంలోని పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలాచరించి గోదావరిమాతకు పూజలు నిర్వహించారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పుష్కరఘాట్లన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పుష్కర యాత్రీకులతో రాజమండ్రి జనసంద్రంగా మారింది. కోటిలింగాల ఘాట్లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో డీజీపీ జేవీ రాముడు ఘాట్ వద్దే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
రాజమండ్రిలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం పుష్కర విధుల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘాట్లలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.
భక్తులతో అధికారులు, పోలీసులు, వలంటీర్లు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. విశాఖ - రాజమండ్రి మార్గంలో రద్దీ నియంత్రణకు బస్ బే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు గురువారం అర్ధరాత్రి రాజమండ్రిలోని పుష్కరఘాట్లలో ఏర్పాట్లను పరిశీలించారు.