జగన్కు వరుస భారీ షాక్లు, అలా చేస్తూ ట్విస్ట్ ఇస్తున్న నేతలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్లు తగులుతున్నాయి.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్లు తగులుతున్నాయి.
అయితే పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ, తాము పార్టీలోనే కొనసాగుతామంటూ, రాజకీయాలకు గుడ్ బై చెబుతామంటూ నేతలు తమ అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.
వైసిపికి షాక్: పని చేయలేకపోతున్నా... జగన్కు కోలగట్ల రాజీనామా లేఖ
ఇటీవల ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తాజాగా, ఆదివారం కోలగట్ల వీరభద్ర రావు విజయనగరం ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇప్పటికే రెండు షాక్లు తగిలాయి.
పార్టీ నేతల్లో కలవరం
కోలగట్ల వీరభద్ర రావు నియోజకవర్గంలో అంతర్గత కలహాలతోనే ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాంధ్ర కన్వీనర్ పదవిలో కొనసాగుతానని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శిలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచీ సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏకంగా జగన్కే తెలియజేశారు. ఈ రెండు పరిణామాలు పార్టీ నేతల్లో కలవరం కలిగించాయి.
పాదయాత్ర తర్వాత
పాదయాత్ర నాటికి ఇంకెన్ని వికెట్లు పడిపోతాయోనన్న బెంగ వైసిపి సీనియర్లకు పట్టుకుందని అంటున్నారు. బొత్సతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తన అన్నయ్య లాంటి వారని కోలగట్ల చెప్పారు. కానీ నియోజకవర్గంలోని విభేదాలకు తోడు బొత్సతో విభేదాల వల్లే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. బొత్స పార్టీలో చేరినప్పటి నుంచి కోలగట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. పైగా నియోజకవర్గంలో విభేదాలు ఆయన అసంతృప్తికి కారణం అయ్యాయని అంటున్నారు.
అప్పుడే టిడిపిలో చేరాలనుకున్నా
బొత్స తీరుపై కోలగట్ల చాలా కాలం నుంచి మనస్తాపంతో ఉన్నారు. ఆయన వైసిపిలో చేరినప్పుడే పార్టీని వదిలేసి, టిడిపిలో చేరడానికి అంతా సిద్దం చేసుకున్నారనే ప్రచారం సాగింది. కానీ జగన్ జోక్యం కారణంగా కోలగట్ల మెత్తబడ్డారు. తన నియోజకవర్గంలోను బొత్స అనుచరుల ఆధిపత్యంతో ఆయన విసిగిపోయారని అంటున్నారు.
ఇదీ బూచేపల్లి రాజకీయ ప్రస్తానం
కాగా, గ్రానైట్ వ్యాపారంలో పేరున్న బూచేపల్లి కుటుంబం 2004 ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత వైయస్ పైన అభిమానంతో కాంగ్రె్సలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు.
బూచేపల్లి దూరం జరగడం నష్టమే
2014లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు చేతిలో 1200 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. పలువురు నేతలు రాయబారం నెరపినా ఫలితం లేకుండా పోయింది. బూచేపల్లి కుటుంబం పోటీకి దూరం కావడంతో దర్శితోపాటు సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ పార్టీకి నష్టం జరుగుతుందని వైసిపి నాయకులు అంటున్నారు.
జిల్లాలో వైసిపికి ఇలా దెబ్బ
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే అద్దంకి, కందుకూరు, గిద్దలూరు, యర్రగొండపాలెం శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్రాజు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. అందులో అద్దంకి, గిద్దలూరు, కందుకూరుల్లో దీటైన నేతలు దొరక్క వైసిపి నాయకత్వం సతమతమవుతోంది.