రాజధాని కమిటీకి కడపలో షాక్, జగన్ పార్టీ డిమాండ్
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీని కడప జిల్లాలో పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆదివారం దొనకొండ, వాన్పిక్ ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సోమవారం కడప జిల్లాలో పర్యటిస్తోంది. అయితే, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శివరామకృష్ణన్ కమిటీని విద్యార్థులు అడ్డుకున్నారు.
కమిటీ సభ్యులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇన్నాళ్లపాటు జరిగిన అన్యాయాన్ని అప్పటికైనా సరి చేయాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ సేకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, రాజధాని అంశంపై శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... అన్ని ప్రాంతాల అభివృద్ధిని తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాయలసీమ సాగునీటి కోసం మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, రాజధాని ఎంపిక విషయంలో దీనిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాజధాని నిర్మాణం సాధారణంగా ముప్పై నుండి వంద సంవత్సరాలు తీసుకుంటుందని, తొందరపడితే భవిష్యత్తు తరాలు నష్టపోతాయన్నారు. ఏపీకి రెండు రాజధానుల అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు.
ప్రభుత్వ భూమి ఉన్నచోటే: వైయస్సార్ కాంగ్రెస్
ఎక్కడైతే ప్రభుత్వ భూమి అధికంగా ఉంటుందో అక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘురాం రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ పాషా, కడప మేయర్ సురేష్ బాబులు డిమాండ్ చేశారు. కడపలో ఇప్పటి వరకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా మంజూరు చేయలేదన్నారు. తెలుగు ప్రజలు, భావితరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని ఏర్పాటు చేయాలన్నారు.