చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు: జగన్పై భగ్గు, దిష్టిబొమ్మల దగ్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారంనాడు భగ్గుమన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
అనంతపురం జిల్లాలో జగన్ భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రదండు కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేపట్టారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తున్న చంద్రదండును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జగన్కు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేపట్టారు. యాడికిలో టిడిపి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీకే.పార్థసారథి నేతృత్వంలో జగన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఓడచెరువులో టీడీపీ కార్యకర్తలు జగన్కు వ్యతిరేకంగా ర్యాలీలు తీసి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనలు, ర్యాలీలకు దిగారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ నగరంలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడి కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో సాంబశివరావు దిష్టిబొమ్మను తనవైపుకు లాక్కున్నారు. దీంతో మంటలు అంటుకున్నాయి. చిత్తూరులోని గాంధీవిగ్రహం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. అనంతపురం జిల్లాలో జగన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.