"మోడీ, పవన్ కల్యాణ్, జగన్ ట్రాయాంగిల్ స్టోరీ, ఆయనెలా కలుస్తారు"
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడుస్తోందని తెలుగుదేశ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక నేరస్థులను ప్రధాని ఎలా కలుస్తారని, అది అనైతికం కాదా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు సామ్రాజ్య విస్తరణ కాంక్షతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
వారు మద్దతివ్వక ముందే అలా..
మోడీ, పవన్ కల్యాణ్ల మద్దతుకు ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ వంటి అవినీతిపరుడిని చైనాలో అయితే బహిరంగంగా ఉరి తీసేవారని అన్నారు. పవన్ కల్యాణ్ పాలపొంగులాంటివాడని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్పై అనుమానం
చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం అనుమానాలు కలిగిస్తోందని శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. జాతీయ పార్టీలన్నీ టిడిపి ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం చంద్రబాబుపై ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. వైసిపి అవిశ్వాసం ఓ డ్రామా అని అన్నారు.
సోమవారం అవిశ్వాసం పెడ్తాం
లోకసభలో సోమవారం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం అన్నారు. స్పీకర్కు శుక్రవారంనాడే మరో నోటీసు ఇచ్చినట్లు ఆయన శనివారం కాకినాడలో చెప్పారు. తాము ప్రతిపాదించే అవిశ్వాసానికి దేశవ్యాప్తంగా పలు పార్టీల నుంచి అనూహ్యమైన మద్దతు వచ్చిందని తోట నరసింహం చెప్పారు. అవిశ్వాసం చర్చకు వచ్చే విధంగా మర్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా కేంద్రం కొన్ని పార్టీల ద్వారా సభలో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు.
పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా యూటర్న్
పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని తోట నరసింహం అన్నారు. తమ పార్టీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. ఎపికి బిజెపి చేసన ద్రోహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు.