టిడిపి నేతల చర్చలు సఫలం: దీక్ష విరమించిన ముద్రగడ
కాకినాడ: తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చల తర్వాత వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి ముద్రగడ పద్మనాభం ముందుకు వచ్చారు. ఆయనతో టిడిపి ఎపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. వారి ముందు ముద్రగడ మూడు ప్రతిపాదనలు ఉంచారు. ప్రభుత్వం తన ప్రతిపాదనలకు అంగీకరించడంతో ముద్రగడ దీక్షను విరమించారు.
ముద్రగడను ఆనందంతో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఆలింగనం చేసుకున్నారు. వారితో కలిసి ముద్రగడ మీడియా ఫొటోగ్రాఫర్లకు ఫోజు కూడా ఇచ్చారు. కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం కిర్లంపూడి వచ్చి ముద్రగడతో చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన తర్వాత ముద్రగడ వైద్య పరీక్షలకు వైద్యులను అనుమతించిన నేపథ్యంలో తీవ్ర సందడి చోటు చేసుకుంది.
ప్రభుత్వం తరఫున ముద్రగడతో చర్చలు జరిపినవారిలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులతో పాటు బొడ్డు భాస్కర రామారావు, శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, వర్మ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇరు వర్గాలకు అంగీకర యోగ్యమైన ప్రతిపాదనలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ముద్రగడకు వివిధ అంశాలపై కళా వెంకట్రావు స్పష్టత ఇచ్చారు. మంచి వాతావరణంలో చర్చలుజరిగాయని, అన్ని విషయాలు ముద్రగడతో మాట్లాడామని కళా వెంకట్రావు మీడియాతో చెప్పారు. కాపు రిజర్వేషన్లపై తొమ్మిది నెలల్లో నివేదిక అందించాలని సూచిస్తూ మంజునాథ్ కమిషన్ వేశామని ఆయన చెప్పారు. వచ్చే బడ్జెట్లో కాపు కార్పోరేషన్కు నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. నిమ్మరసం ఇచ్చి ముద్రగడ చేత కళా వెంకట్రావు దీక్ష విరమింపజేశారు.
ఏడు నెలల 20 రోజుల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధులు ముద్రగడకు హామీ ఇచ్చారు. కాపు కార్పోరేషన్కు వచ్చే బడ్జెట్లో 1500 కోట్లు కేటాయిస్తామని కళా బృందం ఆయనకు హామీ ఇచ్చింది.
కాపుల అంశాలపై సమగ్రంగా చర్చించామని కళా వెంకట్రావు చెప్పారు. ముద్రగడ సూచనలు సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టబోమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్రగడ లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు
కాపు రిజర్వేషన్లపై గత ప్రభుత్వాలు రాజకీయాలుగా వాడుకున్నాయని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తమ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ దీక్ష చేస్తున్నట్లు మీడియాలో చూపిస్తున్నారని, దీంతో బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.
కవ్వింపు చర్యలు లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. బయటి నుంచి వచ్చి తునిలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిందని ఆయన అన్నారు. తుని ఘటనలో చాలా కేసులు నమోదయ్యాయని, వాటిన్నంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై మాత్రమే కేసులు ఉండేలా చూస్తామని, బాధ్యులు కానివారిపై కేసులు లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని, ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చపోవద్దని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఉందని చెప్పినవారే బీసీలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల్లోని పేదలకు మేలు చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖండించాలని ఆయన కోరారు
దీక్ష విరమించిన ముద్రగడను ఆయన అభినందించారు. ప్రభుత్వం ముద్రగడకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.