Save Amaravati: 24 గంటలు: నిన్న దేవినేని ఉమా.. రేపు గద్దె రామ్మోహన్..ఇక వరుసగా..!
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులతో కలిసి 19 రోజులుగా నిరసన ప్రదర్శలను నిర్వహిస్తూ వస్తోన్న టీడీపీ నాయకులు నిరసనలు, ధర్నాల తీవ్రతను పెంచారు. నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు.
రైతులకు మద్దతుగా..
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, దీనికి అదనంగా విశాఖపట్నం, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేయబోతున్నామంటూ వైఎస్ జగన్ ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించారు. ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహించింది. రైతులకు దిశా నిర్దేశాన్ని చేస్తోంది.
దేవినేని ఉమా తరువాత..
రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఇదివరకే 24 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. విజయవాడ శివార్లలోని గొల్లపూడిలో కొద్దిరోజుల కిందటే నిరాహార దీక్షను ముగించారు. అనంతరం ఆ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారు. ఆ శిబిరంలోనే దశలవారీగా రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు.
విజయవాడ తూర్పులో..
తాజాగా- టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అశోక్ నగర్ లో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు గద్దె రామ్మోహన్ నిరాహార దీక్ష ఆరంభమౌతుంది. 24 గంటల పాటు కొనసాగుతుంది. ఆయనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు నిరాహార దీక్షా శిబిరంలో కూర్చోనున్నారు.
కమిటీ నివేదికల రద్దు.. నిర్ణయం వెనక్కి..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సిఫారసు చేస్తూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను రద్దు చేయాలని, మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను వైఎస్ జగన్ వెంటనే విరమించాలనేది టీడీపీ ప్రధాన డిమాండ్. అమరావతిని యధాతథంగా కొనసాగించాలంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.