బీజేపీకి అల్టిమేటం, జగన్కు ఏ1 వార్నింగ్: 11 కేసుల్లో.. స్టేతో ఉమ కౌంటర్
విజయవాడ/అనంతపురం: ఓటుకు నోటు పైన వైయస్సార్ కాంగ్రెస్, ప్రత్యేక హోదా పైన బీజేపీ పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోదా పైన ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని, ప్యాకేజీ ఇచ్చినప్పటికీ తమకు హోదా ముఖ్యమని టిడిపి నేతలు బీజేపీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఏపీకి కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని, తమకు దీంతో పాటు హోదా కావాలని సుజన చౌదరి చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఓటుకు నోటు పైన ప్రతిపక్ష వైసిపి పైన టిడిపి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓటుకు నోటు పైన ఏసీబీ కోర్టుకు వెళ్లగా, విచారణ కోసం న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై చంద్రబాబు హైకోర్టుకు వెళ్లగా ఆయనకు శుక్రవారం ఊరట లభించింది.
దీనిపై టిడిపి నేతలు మాట్లాడుతూ.. హైకోర్టులో స్టే రావడం సంతోషకరమని, వైసిపి చంద్రబాబును ఇరికించే కుట్ర చేస్తోందని భగ్గుమంటున్నారు. పదకొండు ఛార్జీషీట్లలో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడుతున్నారు.
వారి ప్రకటనపై ఆధారపడి ఉంటుంది: ఉమ
తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తాము బీజేపీతో ఎలా ఉంటామనే విషయం.. కేంద్రం చేసే ప్రకటన పైన (ప్రత్యేక హోదా, ప్యాకేజీ) ఆధారపడి ఉంటుందని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
అదే సమయంలో హీరో శివాజీ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కేంద్రం అంగీకరిస్తే చాలని, దీనికి ఐక్య రాజ్య సమితి ఆమోదం అక్కర్లేదని ఎద్దేవా చేశారు. తుని కుట్రలో సంబంధముందనే వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చిందన్నారు.
ఓటుకు నోటు కేసులో హైకోర్టు ఏపీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్కు అనుకూలంగా స్టే ఇవ్వడంపై బోండ ఉమ మాట్లాడుతూ.. ఇది విపక్షాలకు చెంప పెట్టు అన్నారు. జగన్ తన కేసుల్లో ఎందుకు స్టే తెచ్చుకోలేకపోయారని ఎదురు ప్రశ్నించారు.
11 కేసుల్లోని జగన్ అడగడమా: చినరాజప్ప
ఓటుకు నోటు విషయమై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. పదకొండు కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న వైయస్ జగన్ గురించి ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాపు రిజర్వేషన్ల డిమాండ్ రాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సంక్షేమం పైన దృష్టి సారించారని చెప్పారు. కాపులకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాపులకు ఏం చేయాలో మాకు తెలుసునన్నారు.
నిధులు పెరుగుతాయి: బీజేపీ సిద్ధార్థనాథ్ సింగ్
ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ స్థాయిలో కేంద్రం నిధులు ఇస్తుందని బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీ బీజేపీ నేతలతో చెప్పారు. 13వ ఆర్థిక సంఘంతో రూ.85వేల కోట్ల నిధులు వచ్చాయని, 14వ ఆర్థిక సంఘంతో ఆ నిధులు మరిన్ని పెరుగుతాయని చెప్పారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.