షాక్: తెరాస వైపు తీగల? కేసీఆర్తో తలసాని అందుకే..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మహేశ్వరం శాసన సభ్యుడు తీగల కృష్ణా రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను గతంలో హైదరాబాదు నగర పాలక సంస్థ మేయర్గా పని చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.
తీగల కూడా కారు ఎక్కవచ్చుననే ప్రచారం ఊపందుకుంది. అతను సోమవారం నాడు తన కార్యకర్తలతో భేటీ అయ్యారని తెలుస్తోంది. పార్టీ మారే విషయమై చర్చిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే తీగల కృష్ణా రెడ్డితో తెరాస నేతలు టచ్లో ఉన్నారని చెబుతున్నారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాదులో నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. తెరాసకు హైదరాబాదులో అంతగా పట్టులేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున బలం ఉన్న నాయకులను తీసుకొని తద్వారా నగరంలో పట్టు సాధించాలని భావిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలకు తెరాస గాలం వేస్తోందని చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు చెందిన నేతలు తెరాసలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు తెరాసలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఐదారుగురు టీడీపీ ముఖ్య నేతలు కారు ఎక్కవచ్చునని చెబుతున్నారు. ఎర్రబెల్లి పార్టీ మారే వార్తలను కొట్టిపారేస్తున్నారు. తలసాని విషయంలో చాలారోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కూతురు నిశ్చితార్థానికి ఆహ్వానించిన తలసాని
తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. అయిత, తలసాని తన కూతురు నిశ్చితార్థానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు కలిశారు. తలసాని ఇరవై నిమిషాలు కేసీఆర్తో భేటీ అయ్యారు.