అమరావతిలో బుద్దుడి ఆలయం నిర్మాణం: థాయ్లాండ్ కాన్సుల్ జనరల్ వెల్లడి
విశాఖపట్టణం: అమరావతిలో తమ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బుద్ధుడి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచే విధంగా ఉంటుందని థాయ్లాండ్ కాన్సుల్ జనరల్ క్రాంగ్ నిట్ రాకరీన్ వెల్లడించారు. శనివారం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
తాము గతంలో ఇలాగే బుద్ధగయలో 1956లోనే ఒక బౌద్ధ దేవాలయం నిర్మించామని అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిందన్నారు. కొన్ని దశాబ్దాల విరామం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో అదే స్థాయిలో బుద్దుడి ఆలయం నిర్మించనున్నామని ఆమె తెలిపారు. బుద్ధిజం భారత్ నుంచే వ్యాప్తి చెందినందున భారత్ అంటే తమ దేశం వారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు.
అమరావతిలో బౌద్ద ఆలయం ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారని, పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పినందున అందులో థాయ్లాండ్ నిర్మాణ శైలిలో బుద్దుని ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఎపిలో బౌద్ధ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఆయా ప్రణాళికలకు తమ థాయ్లాండ్ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు.
అలాగే ధాయ్ లాండ్, ఆంధ్రప్రదేశ్ ల మధ్య స్నేహ సంబంధాలు మరింత వృద్ది చెందేందుకు వీలుగా ఎపి, థాయ్ లాండ్ మధ్య డైరెక్ట్ విమానం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.