రాష్ట్రపతిని ఎంతగానో ఆకట్టుకున్న టెక్నాలజీ ...ఆర్టీజిఎస్ ప్రయోజనాలివీ...
Recommended Video
అమరావతి: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు అమరావతికి పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్రపతి ఒక అంశాన్ని పరిశీలించేందుకు అత్యధికంగా అరగంట సమయం వెచ్చిస్తున్నారు. రాష్ట్రపతి అంత ప్రాధాన్యం ఇస్తున్న ఆ అంశం ఏమిటంటే ఆర్టీజిఎస్...రియల్ టైమ్ గవర్నెన్స్...
మెరుగైన పరిపాలన కోసం ఎపి ప్రభుత్వం అమలు చేయనున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీని గురించి తెలుసుకొని రాష్ట్రపతి సైతం ముగ్థులయ్యారట. అందుకే నేటి అమరావతి పర్యటనలో ఈ ఆర్టిజిఎస్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్రపతి అత్యధిక సమయం వెచ్చించనున్నారు. దీంతో రాష్ట్రపతి ఆర్టిజిఎస్ లైవ్ వీక్షణకు ఎపి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఎపి ఆర్టీజిఎస్ స్పెషాలిటీ...
రాష్ట్రపతి కోవింద్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిపాలన కోసం సాంకేతిక వినియోగంతో తాము చేసిన ప్రయోగాన్ని ప్రదర్శించనుంది. ఆసియాలోనే అతిపెద్ద పొడవైన 66 అడుగుల హై క్వాలీటి వీడియో స్క్రీన్ పై ఒకేసారి రాష్ట్రంలోని వందల గ్రామాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా అక్కడి తాజా పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే విధానాన్ని(రియల్ టైమ్ గవర్నెన్స్) ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతికి చూపిచ్చబోతోంది.
అందుకే అర్థగంట...
ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ పనిచేసే విధానం, దాని ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుందట. అందుకే ఆర్టీజిఎస్ ప్రధాన అంశాల గురించి తెలుసుకునేందుకు ఈ సెంటర్ లో రాష్ట్రపతి దాదాపు అర్ధగంట సేపు గడపనున్నారు.
ఒకేసారి వందల లైవ్ లు...
ఆర్టీజిఎస్ పరిపాలనలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు గా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సమస్య ఎక్కడుందో, ఆ సమస్య తీవ్రత ఏంటి, అసలు ఆ సమస్య నిజంగా ఉందా అనే విషయాలతో సహా సమస్త విషయాలను ఆర్టిజిఎస్ స్క్రీన్ మీద లైవ్ ద్వారా చూడగలగడం ఈ ఆర్టీజిఎస్ స్పెషాలిటీ. ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగినైనా, మరే సాధారణ పౌరుడినైనా వారు ఉన్న ప్రాంతం నుంచే ఆర్టిజిఎస్ సెంటర్ లో వీక్షించగలగడం, ఇలా ఏకకాలంలో వివిధ శాఖలకు చెందిన వందలమంది అధికారులు, అలాగే పౌరులను అనుసంధానం చేస్తూ ప్రత్యక్ష ప్రసారంలోనే వారిని ప్రశ్నించగల అవకాశం ఆర్టీజిఎస్ ద్వారా ఉంటుంది. అంతే కాదు అసలు ఆ ఉద్యోగి తాను చెబుతున్న విధంగా ఆ ప్రదేశంలో ఉన్నాడా లేదా ,తనకు అప్పగించిన పని పూర్తచేశారా లేదా అనే విషయాలు లైవ్ ద్వారానే తెలిసిపోతాయి.
ఆర్టీజిఎస్...జవాబుదారీతనం...
ఈ ఆర్టీజిఎస్ ద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం మెరుగుపడక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేస్తే ఆ ప్రభుత్వ పాలనకు ఢోకా ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే...
రాష్ట్రపతి వీక్షణ ఎప్పుడంటే...
బుధవారం ఏపీ ఫైబర్ నెట్ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన తరువాత రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ను చూపించనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష జరిపారు. ఒకేసారి వేల కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల పరిస్థితులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్రపతికి చూపనున్న నేపథ్యంలో ఎక్కడా సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను జాగ్రత్త వహించాల్సిందిగా సిఎం చంద్రబాబు హెచ్చరించారు.