'సిఎంను బర్తరఫ్ చేయాలి, బొత్స పైకి రెచ్చగొడ్తున్నారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని తాము గవర్నర్ నరసింహన్ను కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి వివేక్ బుధవారం చెప్పారు. మధ్యాహ్నం పలువురు తెరాస నేతలు గవర్నర్ను కలిశారు. అనంతరం వివేక్, ఇతర నేతలు మాట్లాడారు.
ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని కోరినట్లు వివేక్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని ఆయనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి, కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఆయన తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పైన ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కిరణ్ అబద్దాల కోరు అని, ఎపిఎన్జీవోల ఉద్యోగుల సమ్మెను ఆయన ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైకి విజయనగరంలో జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. కిరణ్ మొదటి నుండి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సమ్మెలు, ధర్నాలు వంటివి ఇలా ఏ కార్యక్రమం జరిగినా తెలంగాణ ప్రజలనే బలి చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతులకు పంట చేతికొచ్చిందని ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు సరికాదన్నారు. కిరణ్ ప్రాంతీయవాదిగా మారారని, నక్సల్స్ విషయంలో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మంద జగన్నాథం అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణఫై కుట్రలకు కేంద్రంగా మారిందని మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు అన్నారు. ముఖ్యమంత్రికి సోనియా గాంధీ కుటుంబ సభ్యుల పైన ప్రేమ లేదని, అందుకు అనంతపురం సంఘటనే నిదర్శనమన్నారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసు అధికారిని సస్పెండ్ చేయించాలని చూశారని ఆరోపించారు. కిరణ్ తమ్ముడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాక్ ఆఫీస్ నడుస్తోందని మండిపడ్డారు.
కిరణ్ ఏకపక్ష వైఖరిని చూస్తూ ఊరుకోవడం సరికాదని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని మరో నేత కె కేశవ రావు అన్నారు. మంత్రులు కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారన్నారు. కాగా, తెరాస నేతలు కెటి రామారావు, ఇతరులు విద్యుత్ సౌధకు వెళ్లారు. వారిని పోలీసులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.