సీఎం జగన్కు వాస్తు ఎఫెక్ట్... సీఎంఓలో భారీ మార్పులు, ఇక చక్రం తిరిగేనా..?
అమరావతి: ఏపీ సీఎం జగన్కు వాస్తు ఎఫెక్ట్ తగిలిందా..? వచ్చే నెలతో ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న జగన్కు ఈ సమయంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఆశించిన నిర్ణయించిన ప్రతీ కార్యక్రమానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. పాదయాత్ర ముందునుంచి స్వరూపానంద స్వామి సూచించిన విధంగా ముహూర్తాలు, నిర్ణయాల విషయంలో ముందుకు వెళుతున్నారు. అయితే కొంత కాలంగా ప్రతీ నిర్ణయం మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితులు సహకరించడం లేదు. 151 సీట్లతో గెలిచిన ఆనందం ఎక్కువకాలం నిలబడలేదనే చెప్పాలి. సాధారణంగా వాస్తు ముహూర్తాలపైన అంతగా నమ్మకం లేని సీఎం జగన్కు కోటరీలోని కొందరు వ్యక్తుల ద్వారా వాస్తు మీద ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోంది. ఒక వైపు కరోనా, మరోవైపు ఆర్థిక కష్టాల నడుమ సడెన్గా ముఖ్యమంత్రి కార్యాలయంలో వాస్తు మార్పులు చేర్పులు చకచకా జరిగిపోతున్నాయి.
Recommended Video
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో...
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన బాగా నమ్మే ఒక సిద్దాంతి సూచన మేరకు సీఎం కూర్చునే సీటు వెనుక పద్మంలాంటి ఆకారం ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతాయని అంతా మంచి జరుగుతుందని ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రివర్గ సహచరులు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు. అయితే తమ ప్రభుత్వానికి తమ పాలనకు సుదర్శన చక్రంగా భావించిన టీడీపీ నేతలకు సీన్ రివర్స్ అయ్యింది. గోల్డ్ కలర్లో సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమని చెప్పుకుంటూ ఆ చక్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయంలోని ఆయన సీటు వెనక అదే విధంగా మంత్రి వర్గ సమావేశం జరిగే హాలులోను అదే ఆకృతిని ఏర్పాటు చేశారు. కానీ ఆ చక్రం చంద్రబాబుకు ఏమాత్రం మేలు చేయలేదనే వాదనా ఉంది.
టీడీపీ ఘోర ఓటమి..లోకేష్ సైతం పరాజయం
ఆ సమయంలోనే కొందరు వాస్తు సిద్ధాంతులు ఆ చక్రం ఏర్పాటును తప్పుబట్టారు. కానీ టీడీపీ నేతలు వాటిని పెడచెవిన పెట్టారు. ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైంది. వ్యక్తిగతంగా చంద్రబాబు అపఖ్యాతి మూటగట్టుకున్నారు. మోడీతో అకారణంగా వైరం పెట్టుకుని అన్ని రకాలుగా నష్టపోయారు. ఆపదలో ఆదుకుంటాడనుకున్న పవన్ కళ్యాణ్ దూరమయ్యాడు. మంత్రి హోదాలో రాజధాని పరిధిలో చంద్రబాబు కొడుకుగా పోటీ చేసిన లోకేష్ సైతం పరాజయం పాలయ్యారు.
జగన్ క్యాంపు కార్యాలయంలో చక్రం ఏర్పాటు
ఇక 2019 ఎన్నికల్లో జగన్ అనూహ్య విజయం సాధించారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత అత్యధిక మెజార్టీతో సీఎం అయ్యారు. పాదయాత్ర, 2019 వైసీపీ అభ్యర్థుల ప్రకటన ముహూర్తం, నామినేషన్ దాఖలు ముహూర్తం గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకార సమయం అన్నీ కూడా స్వరూపానంద నిర్ణయం మేరకే జరిగాయి. ఇదే సమయంలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఈ చక్రం తరహాలోనే మరొకటి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సీటు వెనక ఏర్పాటు చేశారు. దీనిని జగన్తో సహా సీఎంఓ అధికారులు ఎవరూ అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గత కొంతకాలంగా తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా ఆచరణ నోచుకోవటం లేదు.
సీఎం సీటు వెనక ఉండే చక్రం తొలగింపు
మూడు రాజధానుల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలు , ఆర్థికంగా తీవ్ర సంక్షోభం, కోర్టు నుంచి వరుస ఎదురు దెబ్బలు ఇలా ప్రతీ నిర్ణయం ఆదిలోనే నిలిచిపోతున్నాయి. దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కోటరీలోని కీలక వ్యక్తులు తాము నమ్మే స్వామీజీలతో కారణాలు పరిష్కారాలపై చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా ముఖ్యమంత్రి సీటు వెనక రోజూ కనిపించే బంగారపు రంగు చక్రం మాయమైంది. ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ చిహ్నం దర్శనమిచ్చింది. మరి ఆ చక్రం మార్చడం ద్వారా జగన్ చక్రం తిరుగుతుందా... ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్న వాస్తు మార్పుతో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు రాజకీయంగా, పాలనాపరంగా హాట్టాపిక్గా మారింది.