నాగార్జున షో: చిరంజీవి రాజకీయాలు మాట్లాడుతారా?
హైదరాబాద్: నాగార్జున మాటీవీలో నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ ముగింపు కార్యక్రమంపై ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ షోలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ నిర్మాణం ఇది వరకే పూర్తయినప్పటికీ అందులోని అంశాలు మాత్రం వెల్లడి కావడం లేదు.
బుల్లితెరపై ఈ ఇద్దరు హీరోలు ఒక్కచోట కనిపించడం బహుశా ఇదే తొలిసారి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెసులో దాన్ని విలీనం చేసి రాజ్యసభ సభ్యుడై, మంత్రి పదవి కూడా నిర్వహించిన చిరంజీవికి రాజకీయాలు జీవితంలో భాగమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు ఓటమి పాలైంది. కేంద్రంలో కాంగ్రెసు అధికారం కోల్పోవడంతో ఆయన రాజ్యసభ సభ్యుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది.
ఈ తరుణంలో చిరంజీవి తన 150 సినిమాపై దృష్టి పెట్టారు. ఈ స్థితిలో బుల్లి తెర మీద చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జున చిరంజీవిని ప్రశ్నలు వేశారా, ఆ షో ఎలా రూపొందించారనేది తెలియడం లేదు. ప్రశ్నలు వేస్తే నాగార్జున చిరంజీవిని రాజకీయాల గురించి అడిగారా, చిరంజీవే స్వయంగా ఏమైనా చెప్పారా అనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమైన అంశాలు.
అదే సమయంలో చిరంజీవి 150వ సినిమాపై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది. చిరంజీవి జన్మదినం ఆగస్టు 22వ తేదీన ఆ సినిమా నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన వివరాలేవీ వెల్లడి కాలేదు. దాంతో సినిమా వివరాలపై ఆసక్తి నెలకొని ఉంది. రేపు (గురువారం) రాత్రి చాలా మంది టీవీలకు అతుక్కుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రేపు ప్రసారమయ్యే చిరంజీవి, నాగార్జున షోకు సంబంధించి ప్రోమోలు హల్చల్ చేస్తున్నాయి. తాను మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధమేనని చిరంజీవి నాగార్జునతో ఈ షోలో చెప్పారు. హీరోయిన్ తదితర అంశాలపై కూడా చిరంజీవి మాట్లాడారా, లేదా అనేది కూడా ఆసక్తికరమైన విషయమే.