శిక్ష ఐదేళ్లు మించితే...: రామలింగ రాజుకు బెయిల్ వస్తుందా?
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుతో పాటు మిగతా దోషులకు మూడేళ్ల లోపు శిక్ష పడితే ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలున్నాయని రామలింగరాజు తరఫు న్యాయవాదులు చెప్పారు. అంతకు మించి శిక్ష పడితే హైకోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వారన్నారు.
సెక్షన్ 409, 402 సెక్షన్ల కింద దోషిగా నిర్ధారిస్తే సాధారణంగా ఐదేళ్లకు లోబడి శిక్ష విధిస్తారని వారు చెప్పారు. కానీ కేసు పరిధిని బట్టి, సాక్ష్యాలను బట్టి శిక్ష అటూ ఇటుగా ఉండవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. అలాగే నిందితులు దోషులుగా తేలితే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటారని కూడా చెప్పారు. అయితే న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం వుంటుందని వారు చెప్పారు.
రామలింగ రాజుతో పాటు మిగతా దోషులు కూడా తమకు శిక్షలు తగ్గించాలని కోరారు.సత్యం కుంభకోణం కేసులో దోషిగా తేలిన రామలింగ రాజు తనకు శిక్ష తగ్గించాలని న్యాయమూర్తి ముందు మొర పెట్టుకున్న విషయం తెలిసిందే. తన సేవలను గుర్తించైనా తనకు పడే శిక్ష తగ్గించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు.
దోషులుగా విధించే శిక్షలపై గురువారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నేర తీవ్రతను సిబిఐ న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. సత్యం కుంభకోణం కేసులో న్యాయమూర్తి పది మందిని దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే.
సత్యం కుంభకోణం కేసులో రాజు సహా ఆయన తమ్ముడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్గుప్తా కూడా రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై సుప్రీం 2011 నవంబర్ 4న బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి బయటే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు.