జగన్ మనసు నాణ్యతేమిటో పరిశీలించుకోవాలి: యనమల
కాకినాడ/ తిరుపతి/ హైదరాబాద్: పుష్కర పనుల నాణ్యత పరిశీలిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పిన మాటలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. పుష్కర పనుల నాణ్యతను పరిశీలిస్తానని విడ్డూరంగా ఉందని, ముందు జగన్ మనసు నాణ్యతను పరిశీలించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
స్కాములలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనపై కమిటీ వేస్తామనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. చక్కెర కర్మాగారాలపై త్వరలో కేబినెట్ సబ్కమిటీ వేస్తామని, వ్యాట్ తొలగించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి యనమల తెలిపారు.
కాగా, సెక్షన్-8పై తిరుపతిలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలు వక్తలు ప్రసంగించారు. దుర్భాషలను ఇంకా ఎంతకాలం భరించాలి అని గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రత్యేకహోదా, సెక్షన్-8 అమలు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
సెక్షన్-8పై పార్టీలకు అతీతంగా పోరాటానికి సిద్ధమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. సెక్షన్-8పై తిరుపతిలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్-8కు కేంద్రం పరిష్కారం చూపాలని అశోక్బాబు కోరారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అంత మాత్రం దానికి కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
షరతులతో కూడిన బెయిల్ ఇస్తే ఏదో విజయం సాధించినట్టు జైత్రయాత్ర చేశారని విమర్శించారు. ఈ కేసులో రేవంత్రెడ్డి పాత్రదారి మాత్రమేనని అసలు సూత్రదారి ఏపీ సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.