పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?
వైసిపి ప్లీనరీలో వైసిపి అధినేత జగన్ సోదరి షర్మిల ఆదివారం నాడు ఆకట్టుకునే ప్రసంగం చేశారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.
అమరావతి: వైసిపి ప్లీనరీలో వైసిపి అధినేత జగన్ సోదరి షర్మిల ఆదివారం నాడు ఆకట్టుకునే ప్రసంగం చేశారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఆయన అధికారంలోకి రావడానికి ప్రధాని మోడీ ఇమేజ్, అబద్దపు హామీలు అని మండిపడ్డారు.
చదవండి: చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన జగన్, అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర
షర్మిలతో సహా నేతలు అందరూ చంద్రబాబు ఒంటరిగా అధికారంలోకి రాలేదని, మోడీ హవా, అమలు చేయలేని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. షర్మిల సహా నేతలంతా ఈ ప్లీనరీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు.
పవన్ కళ్యాణ్ పేరు దూరం..
2014 నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయాల్లో వైసిపి నేతలు ప్రధాని మోడీ, బిజెపి, పవన్ కళ్యాణ్ల పేర్లు ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మోడీ హవా, పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. కానీ అదే మాటను ప్లీనరీ వేదికగా చెప్పలేదు.
Recommended Video
వ్యూహాత్మకంగానే..
మోడీ పేరును ప్రస్తావించినప్పటికీ, పవన్ పేరును దూరం పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తమకు వైరల్గా మారే పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరించకపోవడమే మంచిదని వైసిపి నేతలు భావించి ఉంటారని అంటున్నారు. అందుకే వ్యూహాత్మకంగానే ఆయన పేరును ఎవరూ ఉపయోగించకపోయి ఉంటారని అంటున్నారు.
బిజెపికి దగ్గరవుతున్నారా?
ప్లీనరీ ద్వారా బిజెపికి దగ్గరవుతున్నట్లుగా వైసిపి ఏమైనా సూచనలు ఇచ్చిందా అంటే కావొచ్చునని, కాదనలేమని చెప్పారని అంటున్నారు. హోదా విషయంలో గట్టిగా మాట్లాడలేదు. ఆ విషయంలో విమర్శించాలనుకున్న చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు హోదాను తీసుకు రాలేకపోయారని చెప్పారే తప్ప, బిజెపి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించే సాహసం చేయలేదు. దీంతో బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు మాత్రం జగన్ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
ప్రత్యేక హోదాపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం
బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు కనిపిస్తూనే.. హోదాపై తాము తగ్గలేదని ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు జగన్. ప్లీనరీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన జగన్.. హోదా గురించి కొంత మాట్లాడి, స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో హోదా గురించి ఏకంగా సభలు, వర్సిటీల్లో సమావేశాలే పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం హోదా అంశం తనకు గుర్తుందని, తన ఎంపీలతో రాజీనామాలు కూడా చేయిస్తానని చెప్పానని మాత్రమే చెప్పారు.
అది దాటవేత
కానీ హోదాపై ఎప్పటిలోగా రాజీనామాలు చేస్తాం.. ఏం చేస్తామనే విషయం మాత్రం జగన్ చెప్పలేదు. కాబట్టి హోదాను జగన్ కూడా వదిలేసినట్లుగానే కనిపిస్తోందని, కానీ చంద్రబాబులా జగన్ కూడా హోదాను పక్కన పెట్టారనే విమర్శలు రాకుండా ఒకటి రెండు ముచ్చట్లు మాట్లాడి వదిలేశారని అంటున్నారు. హోదా గురించి పక్కన పెట్టి, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై మాత్రం తాను పాదయాత్ర చేపడతానని జగన్ చివరలో ప్రకటించారు.