వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?
కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఏడురోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా .. నాలుగురోజుల కస్టడీకి పులివెందుల కోర్టు అంగీకరించింది. దీంతో వీరిని విచారిస్తే హత్యకు సంబంధించి పురోగతి లభించే అవకాశం కనిపిస్తోంది.

సాక్ష్యాలను చెరిపేశారు ..
గత నెల 15న ఇంట్లోనే వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో రక్తపు మరకలు తుడిచివేయడం, అదేరోజు ఉదయం లేఖ లభించినా సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వకపోవడంతో వీరిని అరెస్ట్ చేశారు. తమకు 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా .. పులివెందుల కోర్టు 4 రోజులకు అంగీకరించింది. ఈ నెల 8 వరకు ఈ ముగ్గురిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారించనున్నారు.
4 రోజుల కస్టడీ
వివేకాను కిరాతకంగా హత్యచేసిన నిందితులెవరో ముగ్గురికి తెలిసే అవకాశం ఉందని .. అందుకే వారు సాక్ష్యాలు తారుమారు చేశారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు .. కస్టడీకి అనుమతిచ్చింది. ముగ్గురు నిందితులను కడప సెంట్రల్ జైలు నుంచి గురువారం రాత్రి కస్టడీకి తీసుకున్నారు. వీరిని తమదైన శైలిలో విచారిస్తే .. వివేకా హత్య కేసుకు సంబంధించి నిజనిజాలు వెలికిచూసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications